ముస్లిం దేశాలపై బాంబుల వర్షం కురిపించలేదా ఒబామా?

భారత్‌లో మైనార్టీల హక్కులపై ప్రధాని మోదీని అమెరికా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. కానీ, ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వ్యాఖ్యలను మాత్రం ఆమె తీవ్రంగా ఖండించారు.  ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆరు ముస్లిం దేశాలపై బాంబుల వర్షం కురిపించలేదా? అని ఆమె ప్రశ్నించారు.
వైట్‌‌హౌస్‌లో మోదీ మీడియా సమావేశానికి ముందు ఒబామా సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను భారత ప్రధానితో మాట్లాడితే ఆ దేశంలోని మైనార్టీల హక్కుల గురించి ప్రస్తావిస్తాను అని చెప్పారు.  ‘నేను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడితే భారత్‌లోని మైనార్టీ హక్కుల గురించి ప్రస్తావిస్తాను. వారి హక్కులను పరిరక్షించలేకపోతే భారత్‌ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని ఒబామా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత ప్రధాని అమెరికాలో పర్యటిస్తూ తన దేశం గురించి అక్కడ చెబుతున్న సమయంలో ఒబామా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె హితవు చెప్పారు.  ‘‘ఒబామా వ్యాఖ్యలపై స్పందించేందుకు నేను చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇది అమెరికా, భారత్‌తో ముడిపడి ఉన్న అంశం. మేం వారితో స్నేహం కోరుకుంటున్నాం” అని ఆమె తెలిపారు.
 
“కానీ, అక్కడ కూడా భారత్‌లో మతస్వేచ్ఛ, మైనార్టీల హక్కుల గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. బరాక్‌ ఒబామా హయాంలో ఆరు ముస్లిం దేశాలపై బాంబులతో విరుచుకుపడలేదా? 26,000 బాంబులను ప్రయోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వ్యక్తి మాటలను ఎవరైనా విశ్వసిస్తారా?’’ అని సీతారామన్‌ ప్రశ్నించారు.

‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అన్నదే’ తమ ప్రభుత్వ విధానమని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ సైతం అమెరికాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారని సీతారామన్‌ గుర్తు చేశారు. అంతేగాని మత వివక్ష గురించి ఆయన మాట్లాడలేదని స్పష్టం చేశారు. కానీ, ఆ చర్చలో పాల్గొన్నవారు మాత్రం ఈ విషయాన్ని పక్కనబెట్టి సమస్యలు కాని వాటిని బూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.

అంతేకాదు, ప్రధాని మోదీకి వచ్చిన దాదాపు 13 విదేశీ అవార్డుల్లో 6 అవార్డులు ముస్లిం జనాభా ఎక్కువ దేశాల నుంచే వచ్చాయని తెలియజేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై కూడా నిర్మలాసీతారామన్‌ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రానికి వ్యతిరేకంగా తాము గెలవలేమని భావించిన కొందరు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, అసందర్భ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని ఆమె మండిపడ్డారు.