బిహార్‌లో కూలిన మరో నిర్మాణం లోని వంతెన

బీహార్ రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో కిషన్‌గంజ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. మూడు వారాల వ్యవధిలో ఇది రెండో సంఘటన కావడం గమనార్హం. ఇదే రాష్ట్రం లోని ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఈనెల 4న కూలిపోయిన సంఘటన తెలిసిందే.

ఇప్పుడు మెచ్చినదిపై నిర్మాణమవుతున్న ఈ వంతెన పిల్లర్ కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయి ఉంటే కిషన్‌గంజ్ జిల్లాకు, కథియార్‌కు అనుసంధానం ఏర్పడేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఐదుగురు నిపుణుల బృందంతో దీనిపై దర్యాప్తు చేయిస్తామని అధికారులు తెలిపారు.

పైలింగ్ ప్రాసెస్ సమయంలో మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారంగా తెలుస్తోందని చెప్పారు. రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈ బ్రిడ్జి ప్రమాదం గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) ఈ బ్రిడ్జి నిర్మాణమవుతోందని, బీహార్ రాష్ట్ర ప్రభుత్వంతో దీనికి సంబంధం లేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, జూన్‌ 4న బీహార్‌లోని ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. ఖగారియా జిల్లాను భాగల్పూర్‌తో అనుసంధానించే ఆ వంతెన పేకముక్కలా పడిపోయింది. ఈ సంఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు మరణించాడు. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఆ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై బీహార్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పూర్తైన, నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలకు ‘స్ట్రక్చరల్ ఆడిట్’ నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.