పాక్, చైనా సరిహద్దులతోపాటు విస్తారమైన సముద్ర ప్రాంతంతో అన్ని ప్రాంతాలపై నిఘా పెంచేందుకు దేశ వ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల్లో 31 ప్రిడేటర్ డ్రోన్లను రక్షణ శాఖ మోహరించనున్నది. అమెరికా పర్యటన సందర్భంగా 31 ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు ప్రణాళికను భారత్, అమెరికా ప్రకటించాయి.
ఈ డ్రోన్లను మూడు ప్రధాన భాగాల్లో మోహరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీనియర్ డిఫెన్స్ అధికారుల ప్రకారం మూడు ప్రధాన భాగాల్లో ఒకటి ఉత్తర లేదంటే వాయువ్య ప్రాంతంతో పాటు మరొకటి ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. 2020- 21లో చైనాతో ప్రతిష్ఠంభన నేపథ్యంలో రెండు ప్రిడేటర్ డ్రోన్లను భారత్ లీజుకు తీసుకొని మోహరించింది.
ఆయా డ్రోన్లకు ఐఎన్ఎస్ రాజాలి హబ్గా ఉన్నది. త్రివిధ దళాలు ఈ డోర్న్లను బేస్ల నుంచి సైతం నిర్వహిస్తాయి. లీజుకు తీసుకున్న డ్రోన్లను జనరల్ అటామిక్స్ ప్రతినిధులు నిర్వహిస్తారు. ఈ మూడు సర్వీస్లకు చెందిన భారతీయ పైలట్లు డ్రోన్ల నిర్వహణకు భారత్తోపాటు అమెరికా లోనూ శిక్షణ పొందనున్నారు.
త్రివిధ దళాలు సంయుక్తంగా డ్రోన్లను నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. లాంగ్ ఎండ్యూరన్స్ రకానికి చెందిన మానవ రహిత వైమానిక వాహనాల సంఖ్యను తెలుసుకోడానికి ట్రైసర్వీస్ అధికారులు వివరణాత్మక శాస్త్రీయంగా విశ్లేషించారు. ‘హెలికాప్టర్లు, డ్రోన్లు, వాయు రక్షణ ఆయుధ వ్యవస్థలతో సహా ట్రై సర్వీస్ అన్ని భవిష్యత్ ఒప్పందాలు అదే పద్ధతిలో జరుగుతాయి’ ఓ అధికారి పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ రెండు ప్రధాన శత్రుదేశాలతో విస్తారమైన భూభాగంతో పాటు సముద్ర సరిహద్దులను పంచుకుంటుంది. ఇందులో ఒకటి పాక్ కాగా, మరొకటి చైనా. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు శత్రుదేశాల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడం అవసరమని సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రిడేటర్ డ్రోన్లను ఎంక్యూ -9 రీపర్ పేరుతో పిలుస్తుంటారు. నిరంతరంగా 36 గంటల వరకు ఎగరగలవు.
More Stories
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం