
మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్లు విచారణకు రావాలంటూ సిఐడి నోటీసులు జారీ చేసింది. జులై 5వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులిచ్చింది. గుంటూరులోని సిఐడి రీజనల్ ఆఫీస్కు హాజరు కావాలని సిఐడి నోటీసులు అందజేసింది.
ఈ కేసులో ఎ1గా రామోజీరావు ఉండగా, ఎ2గా శైలజా కిరణ్లు ఉన్నారు. 41ఎ కింద వారికి నోటీసులిచ్చింది. ఈ నెల మొదటివారంలో ఎ2గా ఉన్న శైలజా కిరణ్ను సిఐడి విచారించిన సంగతి విదితమే. శైలజా కిరణ్ నివాసంలోనే ఆమెను సిఐడి విచారించింది.
కాగా, విచారణ కోసం శైలజా కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని పది మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారని సిఐడి అదనపు ఎస్పి రవికుమార్ పేర్కొన్నారు. ఆర్థిక అక్రమాలకు సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక ఆధారాలను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు.
తాము చట్టం పరిధి లోనే విచారిస్తున్నప్పటికీ శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండిగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు.
ఎండి వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారని ఆరోపించారు. విచారించిన ప్రతీసారి ఏదో సాకుతో తప్పించు కోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందని తెలిపారు.
శైలజా కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు.
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ