మోదీ పర్యటనపై భారతీయ సంతతి అమెరికన్లలో జోష్

అమెరికాలో బుధవారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాలుగురోజుల అధికారిక పర్యటనపై అక్కడి భారతీయ సంతతి అమెరికన్లలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రెసిడెంట్ జో బైడెన్ దంపతుల వ్యక్తిగత ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకూ అమెరికాలో పర్యటిస్తారు. 2014 నుంచి మోదీ ఆరు సార్లు అమెరికాలో పర్యటించారు.

భారత ప్రధాని వస్తున్నందున ఆయనను చూడాలని, వీలైతే ఏదో ఓ సందర్భంలో ఇంటరాక్ట్‌లో మాట్లాడాలని అమెరికాలోని భారతీయ సంతతి వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రత్యేకించి భారతదేశం నుంచి అమెరికాకు చాలా కాలం క్రితమే వచ్చి వివిధ రంగాలలో స్థిరపడ్డ వారు, భారతీయ సమాజం సంస్థలను ఏర్పాటు చేసుకుని, వాటికి సారథ్యం వహిస్తున్న వారు మోదీ  పర్యటన పట్ల ఆకర్షితులు అయ్యారు.

అమెరికాలో పలు ప్రాంతాలలో ప్రత్యేకించి భారతీయ సంతతి ఎక్కువగా ఉండే చోట్ల మోదీ  క్రేజ్ నెలకొంది. వందలాది ఇండో అమెరికన్లు అమెరికా వ్యాప్తంగా 20 నగరాలలో ప్రదర్శనలు నిర్వహించారు. పలు చోట్ల మరో రెండు రోజులలో వీటిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు సన్నాహాలు చేపట్టారు. అమెరికా గుర్తుకు వచ్చేలా నిలిచే అందరికి అమెరికాను తలపించే నగరాలలో మోదీ  కటౌట్లు, ప్రధాన కూడళ్లల్లో కొన్ని చోట్ల సభలు చేపట్టారు. ఐక్యతా ర్యాలీలు, ప్రధాని మోదీకి స్వాగత సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

21వ తేదీన అంతర్జాతీయ యోగాదినోత్సం ప్రధాన ఘట్టం జరిగే న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయం వద్ద ప్రధాని ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా ఉంటారు. ఈ నెల 22న ప్రధాని మోదీ గౌరవార్థం బైడెన్ దంపతులు శ్వేతసౌథంలో విందు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రధాని మోదీ అదే రోజున అమెరికా చట్ట సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు.

ఈ నెల 23న ఆహ్వానితులైన వేయి మందితో కూడిన సభలో వాషింగ్టన్ డిసిలో ఆయన భారతీయ సంతతి వారిని ఉద్ధేశించి ఇష్టాగోష్టిగా మాట్లాడుతారు. అక్కడి రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది.  ముందస్తు స్వాగతంగా వాషింగ్టన్ డిసిలో ఆదివారం వందలాది మంది భారతీయులు జాతీయ స్మారక స్థూపం వద్ద గుమికూడారు. ఆహ్లాదకరమైన ఆదివారపు ఎండపొడల మధ్య వారు ఉత్సాహంగా కన్పించారు.

పలుచోట్ల మోదీ మోదీ నినాదాలు వెలువడ్డాయి. న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి తదితర అనేక చారిత్రక ప్రదేశాల్లోనూ ఆదివారం ఇవే దృశ్యాలు కనిపించాయి. హుస్టన్‌లో ప్రతీకాత్మకమైన సుగర్‌లాండ్ మొమోరియల్ పార్క్ వద్ద భారతీయ సామాజానికి చెందిన వారు మోదీ  ప్లకార్డులతో నిలిచారు.

భారత జాతీయ మువన్నెల జెండాలతో ఇదే సమయంలో బోస్టన్, చికాగో, అట్లాంటా, డల్లాస్, టంపా, లాస్‌ఏంజిల్స్ వంటి పలు ప్రధాన నగరాలలో మోదీ రాకపట్ల ఉత్సాహం వెల్లువెత్తింది. అలాగే, మోదీ ప్రసంగించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు టికెట్ల కోసం భారతీయ అమెరికన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.