జేఈఈ అడ్వాన్స్‌డ్ లో చిద్విలాస్‌ రెడ్డికి మొదటి స్థానం

అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలలో  హైదరాబాద్‌ జోన్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌ రెడ్డి(నాగర్‌కర్నూల్‌)కి  మొదటి స్థానం లభించింది. అలాగే, టాప్‌-10 ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు విద్యార్థులే ఉండటం గమనార్హం.  రమేష్ సూర్య తేజకు 2వ ర్యాంకు, అడ్డగడ వెంకట శివరామ్‌కు 5వ ర్యాంకు, బిక్కిన అభినవ్ చౌదరికి 7వ ర్యాంకు, నాగిరెడ్డి బాలాజీ రెడ్డికి 9వ ర్యాంకు, యక్కంటి పాణి వేంకట మనీంధర్ రెడ్డికి 10వ ర్యాంకు వచ్చింది.

హైదరాబాద్ జోన్‌కు చెందిన మరో తెలంగాణ విద్యార్థి నాయకంటి నాగ భవ్యశ్రీ 298 మార్కులతో ఆలిండియా 56వ ర్యాంకు సాధించగా, అమ్మాయిల విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 43 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షను క్లియర్‌ చేశారు.  ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షలో చిద్విలాస్‌రెడ్డి 360 మార్కులకు గానూ 341 మార్కులు సాధించాడు. ఇదే హైదరాబాద్‌ జోన్‌కు చెందిన నాయకంటి భవ్య శ్రీ 298 మార్కులతో బాలికలలో మొదటి స్థానాన్ని పొందారు.

కాగా, జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ (జేఓఎస్‌ఏఏ లేదా జోసా) కౌన్సిలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. పరీక్షలో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని ‘జోసా’ కౌన్సిలింగ్‌కు అర్హత కల్పిస్తారు. మొదటి ర్యాంకుల్లో సుమారు వందకు పైగా ర్యాంకులు సాధించి తెలుగు విద్యార్థులు మెరుపులు మెరిపించారు.

ఈ నెల 4న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు. అందులో 43, 773 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 36,264 మంది అబ్బాయిలు ఉండగా.. 7,509 మంది అమ్మాయిలు ఉన్నారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచే అత్యధికంగా 10,432 మంది ఉత్తీర్ణులయ్యారు.

హైదరాబాద్‌ జోన్‌ నుంచే అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో అర్హతను సాధించారు. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే జోన్‌లు ఉన్నాయి. టాప్‌ 500 మంది అభ్యర్థులలో ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ నుంచి 174 మంది, ఐఐటీ ఢిల్లీ జోన్‌ నుంచి 120 మంది, ఐఐటీ బాంబే జోన్‌ నుంచి 103 మంది ఉన్నారు. మొత్తం 13 మంది విదేశీ విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. అలాగే 155 మంది ఓవర్సీస్‌ సిటిజెన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) అభ్యర్థులు పరీక్షను క్లియర్‌ చేశారు.