వ్యవసాయరంగంలో సుస్థిరతకు కలిసి పనిచేద్దాం

వ్యవసాయరంగంలో సుస్థిరతను సాధించేందకు కలిసి పనిచేద్దాం..ప్రకృతి సవాళ్లను ఎదుర్కొందాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జి20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా గురువారం జి20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. వ్యవసాయ రంగంలో భారతదేశం చాలా సుసంపన్నంగా, శక్తివంతంగా ఉందని, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రపంచ ప్రయోజనాల కోసం తన జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచుకుంటా భవిష్యత్తులో కూడా సహకరించేందుకు  సిద్ధంగా ఉంటామని తోమర్ తెలిపారు.

మాదాపూర్ హెచ్‌ఐసిసిలో మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. భారత్ తో పాటు జి20 సభ్య దేశాల నుంచి పలువురు వ్యవసాయ శాఖల మంత్రులు , అంతర్జాతీయ పరిశోధనల సంస్థలకు చెందిన ప్రతినిధులు , శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

జి20 ప్రారంభ సమావేశాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి తోమర్ మాట్లాడుతూ వ్యవసాయరంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరైన పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కృషిలో భాగంగా జి20దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. అనేక వ్యవసాయోత్పత్తులలో భారతదేశం ప్రపంచంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉందని చెబుతూ భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి నిరంతరం పెరుగుతోందని, ఇది రైతులకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందని తోమర్ తెలిపారు.

అనూహ్య వాతావరణ మార్పుల నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారత్‌లో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు వాటి పరిష్కారాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు తెలిపారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహార భద్రత , పోషకాహార భద్రతపై చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.

వ్యవసాయం, ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదక పెంపుదల తదితర అంశాలపైన చర్చలు జరుగుతున్నాయని ఆయన మీడియా సమావేశంలో వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అన్నదాతల ఆదాయాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.  ప్రత్యేకించి సన్న చిన్నకారు రైతులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు తోమర్ వెల్లడించారు.

దేశంలో సేంద్రీయ , సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని , సేంద్రీయ రైతులు తమ ఉత్పత్తుల  అమ్ముకోవడానికి మార్కెటింగ్ లింకేజి కల్పించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసి వ్యవసాయ ప్రదర్శనకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి ప్రారంభోత్సవం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో భారత్ సాదించిన విజయాలను ప్రదర్శించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు.