బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌లా కాంగ్రెస్ పార్టీ

తెలంగాణాలో బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌లా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని బిజెపి ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కొన్ని సందర్భాల్లో బీ-టీమ్‌లా, కొన్నిసార్లు సీ-టీమ్‌లా కూడా కాంగ్రెస్ పార్టీయే పోటీ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్‌తో బీజేపీకి రహస్య ఒప్పందాలు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అభూత కల్పన అంటూ ఆయన కొట్టిపారేశారు. ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాలు తలపెట్టిన సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు కేసీఆర్ కూడా హాజరవుతున్నారని తరుణ్ చుగ్ చెప్పారు.

దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. పైస్థాయిలో అందరూ కలిసే పనిచేస్తారని, రాష్ట్రానికి వచ్చేసరికి విమర్శలు చేసుకుంటారని ధ్వజమెత్తారు. కాగా,  ఈ నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా తెలంగాణ పర్యటన చేపట్టనున్నట్టు తరుణ్ ఛుగ్ ప్రకటించారు.

తెలంగాణలో నాగర్‌కర్నూల్‌లో ఓ భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారని వెల్లడించారు. గుజరాత్‌పై విరుచుకుపడ్డ ‘బిపర్‌జోయ్’ తుఫాను కారణంగా గురువారం చేపట్టాల్సిన అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు చెబుతూ, ఆయన త్వరలోనే రాష్ట్ర ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. 

మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మార్పు గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన మరోసారి ఆయన స్పష్టతనిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మార్చేది లేదని తేల్చి చెప్పారు. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల రణరంగంలో పాల్గొంటారని చుగ్ వెల్లడించారు. పార్టీలో ముఖ్య నేతలందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయని తెలిపారు. బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.