జూన్ 15 నుంచి జీ -20 వ్యవసాయ రంగంపై సదస్సు

జూన్ 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జీ-20 వ్యవసాయం రంగంపై సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. జీ-20 దేశాలతో పాటుగా మరో 9 అతిథి దేశాల వ్యవసాయశాఖ మంత్రులు సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. భారత్ సహా ప్రపంచ దేశాలు ఈసమావేశాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని చెప్పారు.

హైదరాబాద్ లో వ్యవసాయ పరిశోధన సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.  కరోనా తర్వాత తలెత్తిన సమస్యలపై చర్చించడానికి జీ-20 సమావేశాలు వేదికగా మారాయి. 46 రంగాలపై 250 సమావేశాలు జరుగుతున్నాయి.

ఇప్పటికీ 140 సమావేశాలు పూర్తయ్యాయి. రాజధాని కేంద్రంగా కీలకమైన రంగాలపై సమావేశాలు జరుగనున్నాయి. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లో స్టార్టప్ ను ప్రోత్సహించడానికి సమావేశాలు జరిగాయి. రెండో సమావేశం ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ అంశాలపై చర్చించారు. జూన్ 4,5,6 తేదీల్లో జీ-20 హెల్త్ వర్కింగ్ 5 సమావేశం జరిగింది.

పర్యాటక రంగానికి సంబంధించి చివరి సమావేశాలు ఈ నెల 21,22,23 తేదీల్లో గోవాలో నిర్వహించనున్నరని తెలిపారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రగతి మైదాన్ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన తుది సమావేశాలు జరుగుతాయని తెలిపారు.