నియామక ప్రక్రియలో అవినీతి, బంధుప్రీతిని ప్రోత్సహిస్తూ కుటుంబ పార్టీలు యువతకు ద్రోహం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న 70 వేల మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ ‘రేటు కార్డ్’లతో యువత ఉద్యోగాలను దోచుకున్నాయని ఆరోపించారు.
కుటుంబ రాజకీయ పార్టీలు అన్ని వ్యవస్థల్లో బంధుప్రీతి, అవినీతిని ప్రోత్సహించాయయని, ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లోనూ ఈ విధానాన్ని పాటించాయయని ధ్వజమెత్తారు. అయితే తమ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని బంధుప్రీతికి ముగింపు పలికిందని, యువత భవిష్యత్కు రక్షణగా నిలిచిందని పేర్కొన్నారు.
దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలను అందించడానికి ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ వంటి అనేక సంస్థలు ఉన్నాయని చెబుతూ పరీక్ష ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా చేయడమే ఈ సంస్థల ధ్యేయమని ప్రధాని తెలిపారు. ఇంతకుముందు నియామక ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టేదని చెప్పారు.
ఒకవేళ ఈ నియామకాల వివాదం కోర్టుకు వెళితే వివాదం ముగిసేసరికి మరో రెండు లేదా 5 ఏళ్లు వృథా అయ్యేవని అంటూ వీటన్నింటి నుంచి ఇప్పుడు బయటపడ్డామని, కొద్ది నెలల్లోనే నియామకాల ప్రక్రియ మొత్తం ఎంతో పారదర్శకంగా పూర్తవుతోందని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్ స్థిరంగా ఉందన్న మోదీ దశాబ్దం క్రితం కంటే బలంగా, సురక్షితంగా దేశం ఉందని స్పష్టం చేశారు.
నిర్ణయాత్మకత భారత ప్రభుత్వానికి గుర్తింపుగా మారిందని తెలిపారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పారు.
ముద్రా యోజన, స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాల కారణంగా స్వయం ఉపాధి అవకాశాలు కూడా యువతకు కలిగాయని మోదీ వివరించారు.
మరోపక్క ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందని, అయినప్పటికి ఈ సవాళ్లు అన్నింటినీ భారత్ అధిగమించి కొత్త శిఖరాలను అందుకుందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలోని ప్రైవేటు రంగంలో లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ రోజ్గార్ మేళా బీజేపీ, ఎన్డీఎ ప్రభుత్వాలకు కొత్త గుర్తింపునిస్తోందని తెలిపారు.
More Stories
ప్రపంచ నాగరికత కోసం సనాతన ధర్మాన్ని గౌరవించాలి
అమెరికాలో భారత్ వ్యతిరేక సెనేటర్ తో రాహుల్ భేటీపై బిజెపి ఆగ్రహం
పాకిస్థాన్ తో చర్చలు జరిపే కాలం ముగిసింది