జల్‌ జీవన్‌ మిషన్‌తో 4 లక్షల మరణాల నివారణ!

జల్‌ జీవన్‌ మిషన్‌ (జెఎంఎం)తో దేశవ్యాప్తంగా పైపుల ద్వారా తాగునీటిని ప్రజలకు అందించినట్లైతే భారత్‌లో దాదాపు 4లక్షల డయేరియా మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.
 
ప్రతి ఇంటికీ పైపుల ద్వారా మంచినీరును అందించాలనే లక్ష్యంతో 2019లో దాదాపు రూ. 3.6లక్షల కోట్ల వ్యయ అంచనాలతో కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ (జెజెఎం) ప్రారంభించింది. పైగా ఇలా తాగునీటినికుళాయి కనెక్షన్ల ద్వారా అందించడం వల్ల కోటీ 40లక్షల డిఎఎల్‌వై (డిజెబిలిటీ అడ్జస్టెడ్‌ లైఫ్‌ ఇయర్స్‌)లను నివారించవచ్చని కూడా తెలిపింది.
 
అదేవిధంగా, పదివేల కోట్ల డాలర్లుకుపైగా మొత్తాన్ని ఆదాచేయవచ్చని, ప్రతి రోజూ మహిళలు నీటిని పట్టుకునేందుకు ఉపయోగించే సమయాన్ని 6.6కోట్ల గంటలను ఆదా చేయవచ్చని అధ్యయన వివరాలతో రూపొందించిన నివేదిక పేర్కొంది. డిఎఎల్‌వై అంటే పూర్తి స్థాయి ఆరోగ్యంతో కూడిన దాదాపు ఒక సంవత్సర కాలం నష్టానికి సమానం.
 
ప్రజల్లో ఏదో ఒక వ్యాధి లేదా అనారోగ్య పరిస్థితి నెలకొను కేసులను లెక్కించడానికి, ముందస్తు మరణాల కారణంగా కోల్పోయిన జీవిత కాలానిు వైఎల్‌ఎల్‌ (ఇయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ లాస్ట్‌) గా, ఇయర్స్‌ లివ్‌డ్‌ విత్‌ ఎ డిజెబిలిటీ (వైఎల్‌డి)గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో 12.3కోట్ల లేదా 62 శాతం గ్రామీణ కుటుంబాలకు ఇళ్ళలో కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.
 
2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో ఈ సంఖ్య 3.2కోట్లుగా లేదా 16.6శాతంగా వుంది. 2024 నాటికి వంద శాతం కుటుంబాలకు పైపుల ద్వారా తాగునీటిని అందించగలమని కేంద్రం చెబుతోంది. పూర్తి స్థాయిలో పనిచేసే కుళాయి కనెక్షన్‌ అంటే ఒక కుటుంబం ఏడాది పొడవునా రోజుకు సగటున 55 లీటర్ల తాగు నీటిని పొందడంగా నిర్వచించింది.
 
ఈ అంచనాలకు రావడానికి అవసరమైన డేటా కోసం నివేదిక రూపకర్తలు ఐక్యరాజ్య సమితి నుండి వచ్చిన జనాభా డేటాను, 2018 నాటి నేషనల్‌ శాంపిల్‌ సర్వేను, నీటి నాణ్యతపై జెజెఎం సేకరించిన డేటాను ఉపయోగించారు. ప్రస్తుతం ప్రతి రెండో ఇంటికి తాగునీటి కనెక్షన్‌ అందించబడింది.
 
 ఐదు రాష్ట్రాలు గుజరాత్‌, తెలంగాణా, గోవా, హర్యానా, పంజాబ్‌, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్‌ నికొబార్‌ దీవులు, డామన్‌ డయ్యూ, దాద్రానాగర్‌ హవేలి, పుదుచ్చేరిల్లో వంద శాతం కనెక్షన్లు ఇచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో 98.87శాతం, బీహార్‌లో 96.3శాతం కనెక్షన్లు ఉన్నాయని తాగునీరు, పారిశుధ్య విభాగ కార్యదర్శి వినీు మహజన్‌ తెలిపారు.
 
తాగునీరు, పారిశుధ్య రంగాల్లో పెట్టే పెట్టుబడుల వల్ల అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని, ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలతో పాటూ నాణ్యత గల జీవనం, ఆరోగ్యం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. పారిశుధ్య రంగంలో ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి ఆరోగ్య సంరక్షణ వ్యయం రూపంలో 4.3 రూపాయిలు తగ్గడం ద్వారా లాభం వుంటుందని ఆమె చెప్పారు.