డ్ర‌గ్ మాఫియా నెట్ వ‌ర్క్ ఛేదించిన ఎన్ సి బి

డార్క్‌ వెబ్ ఆధారంగా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోన్న ఓ భారీ నెట్‌వర్క్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. సింథటిక్ రసాయనాల ఆధారిత మాదక ద్రవ్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్ర‌మేయం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసింది.  అలాగే రూ.కోట్ల విలువైన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ సి బి ప్రకటించింది.
నిందితులు క్రిప్టోకరెన్సీతో డార్క్ వెబ్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని గుర్తించింది. ఇప్పటివరకు ఒకే ఆపరేషన్‌లో ఈ స్థాయిలో ఎల్‌ఎస్‌డీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని వెల్లడించింది.
 
‘ఈ భారీ నెట్‌వర్క్ దేశ, విదేశాల్లో విస్తరించి ఉంది. పోలాండ్, నెదర్లాండ్స్, అమెరికాలనుంచి ఎల్‌ఎస్‌డీని అక్రమంగా దిగుమతి చేసుకొని దిల్లీ- ఎస్‌ఈఆర్‌, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నారు’ అని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉత్తర విభాగం) జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు.
 
`చెల్లింపుల కోసం డార్క్‌ నెట్‌లో క్రిప్టో కరెన్సీలను ఉపయోగించారు. నిందితుల వద్ద నుంచి రూ.4.60 లక్షల విలువైన 2.2 కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నాం. బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షలు ఉన్నట్లు గుర్తించాం’  అని వివరించారు.
 
నిందితులు డార్క్ నెట్ ద్వారా క్రిప్టో వాలెట్స్, క్రిప్టోకరెన్సీలను ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్నారన్నారు. కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య భౌతిక సంబంధాలు ఉండవని చెప్పారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్ పోలాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ తో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ- వంటి ప్రాంతాలకు విస్తరించి ఉందని  ఎన్‌సీబీ అధికారి ఒకరు తెలిపారు.
 
ఈ ఆపరేషన్‌లో 2.5 కేజీల మారిజువానాను, రూ.24.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎల్ఎస్‌డీని 0.1 గ్రాము కన్నా ఎక్కువగా కలిగియుండటం చట్ట ప్రకారం నేరం.  ఇది హయ్యర్ గ్రేడ్ మాదక ద్రవ్యం కాబట్టి దీని విలువ కూడా ఎక్కువేనని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.  పట్టుబడిన ఎల్‌ఎస్‌డీ వాసన, రుచి లేదని, పుస్తకాల సహాయంతో రవాణా చేయడం వల్ల గుర్తించడం చాలా కష్టమైందని చెప్పారు. 
ఎల్‌ఎస్‌డీ దుర్వినియోగం యువతలో ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. తాజా దాడిలో పట్టుబడిన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌లు దాని వాణిజ్య పరిమాణం కంటే 2,500 రెట్లు ఎక్కువని వెల్లడించారు. ఒక బ్లాట్‌. చిన్న పేపర్‌ ముక్క పరిమాణంలో ఉంటుంది. ప‌ట్టుబ‌డిన ఈ బ్లాట్ల విలువ కోట్ల‌లో ఉంటుంద‌ని ఎన్ సి బి అధికారులు వెల్ల‌డించారు..