మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహారంలో సంస్త్ర్హ ఎండి చెరుకూరి శైలజను ఏపీ సిఐడి బృందం మంగళవారం పది గంటలసేపు జూబ్లీహిల్స్‌లోని రామోజీరావు నివాసంలో పదిగంటలసేపు విచారించింది.  గత నెలలో సిఐడి నోటీసులు జారీచేసినా ఆమె విదేశ పర్యటనకు వెళ్లడంతో విచారణకు హాజరుకాలేక పోయారు.
నేడు కొంతమేరకు మాత్రమే ఆమె సమాధానాలు ఇచ్చారని, మరోసారి విచారింపవలసి ఉందని తర్వాత అధికారులు తెలిపారు.
విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు మొత్తం 30 మంది అధికారులు విచారణలో పాల్గొన్నారు.  మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థలో భారీ ఎత్తున ఆర్ధిక లావాదేవీలు జరిగాయని, వందల కోట్ల రుపాయల నగదు లావాదేవీలకు లెక్కలు చూపడం లేదని సిఐడి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సిఐడి విచారణపై మార్గదర్శి సంస్థ తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించింది.
 
చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. రామోజీ గ్రూప్‌ కంపెనీలకు ఫండ్స్‌ మళ్లించినట్టు సీఐడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. మార్గదర్శి సంస్థకు చెందిన రూ. 798.50 కోట్ల విలువైన చరాస్తులను గత నెలల్లో సిఐడి అటాచ్‌ చేసింది.  మార్గదర్శి ఛైర్మన్‌, ఎండీ, ఫోర్‌మెన్‌, ఆడిటర్లు కలిసి కుట్రకు పాల్పడినట్లు, చిట్స్‌ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు.
ఏపీలో 1989 చిట్స్‌ గ్రూప్‌లు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ప్రజల నుంచి సేకరించిన నగదు ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని గుర్తించిన సీఐడీ, చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.
మార్గదర్శి కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్‌గా పేర్కొంది. ఫోర్‌మెన్, ఆడిటర్లతో కలిసి కుట్రకు పాల్పడినట్టు సిఐడి తెలిపింది. చిట్స్‌ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. అక్రమాలు జరిగాయన్న ఆరోప ణలతో పలు మార్లు ఆ సంస్థ కార్యాలయాల్లో సిఐడి సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఐపిసి 120(బి), 409, 420, 477(ఏ), రెడ్ విత 34కింద ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఎపి ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999లో సెక్షన్ 5 తో పాటు చిట్ ఫండ్ యాక్ట్ 1982లోని 76,79సెక్షన్ల ప్రకారం సోదాలు నిర్వహించింది. మార్గదర్శి మేనేజర్లను అరెస్టు చేసింది. రామోజీరావు, శైలజాకిరణ్‌ను ప్రశ్నించింది.

ఉద్దేశపూర్వకంగా సంస్థ చిట్‌ఫండ్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపారు. మరోవైపు మార్గదర్శి సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ సిఐడిని తెలంగాణ హైకోర్టు ఆశ్రయించడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు జులైలో విచారణకు రానుంది.