మణిపూర్ అల్లర్లపై త్రిసభ్య కమిషన్

మణిపూర్ లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల గురించి దర్యాప్తు జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ ను నియమించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్వాప్తు కమిషనన్‌కు గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లంబా నాయకత్వం వహించనున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి హిమాన్షు శేఖర్ దాస్, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అలోక ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు.

మణిపూర్‌లో అల్లర్లకు కారణాలు, హింసాకాండ విస్తరించడానికి దారితీసిన పరిస్థితులపై కమిషన్ దర్యాప్తు చేస్తుంది. 6 నెలల్లోగా దర్వాప్తు నివేదకను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.  మైతీ వర్గాన్ని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న హిల్ డిస్ట్రిక్ట్స్‌లో చేపట్టిన ”గిరిజన సంఘీభావ ర్యాలీ” అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు మొదలై, పెద్దఎత్తున హింస చెలరేగింది. ఈ హింసాకాండలో 80 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర బలగాలను ఆ రాష్ట్రంలో మోహరించారు.

కాగా, అల్లర్లు, హింసాకాండంతో అట్టుడికిన మణిపూర్‌లో శాంతిని పాదుకొలుపుదామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మణిపూర్‌లో తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన వరుస ట్వీట్లలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు, శాంతిని నెలకొల్పేందుకు ప్రజలందరూ కలిసిరావాలని కోరారు.

నేషనల్ హైవే-2పై ఉంచిన దిగ్బంధనాలను తొలగించాలని వారికి విజ్ఞప్తి చేశారు. దిగ్బంధాల వల్ల కనీస అవసరాలైన ఆహారం, ఔషధాలు ఇంధనం సరఫరాలో సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ఈ దిశగా సామాజిక సంస్థల కార్యకర్తలంతా కృషి చేయాలని అమిత్ షా కోరారు.

అందమైన మణిపూర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించేందుకు అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్ల సమయంలో తలెత్తిన లోపాలు, విధి నిర్వహణలో విఫలమైన అధికారులు, వ్యక్తులను గుర్తించేందుకు ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ప్రభుత్వం ఆదివారంనాడు ఏర్పాటు చేసినట్టు మరో ట్వీట్‌లో అమిత్‌షా తెలిపారు.