తెలంగాణ యువతలో తీవ్ర నిరాశ

తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు గడుస్తున్నా యువత, మహిళలు నిరాశలో ఉన్నారని హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత, సమాన హక్కులు లేక మహిళలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. లిక్కర్​ కారణంగా తమ కుటుంబాలు ఛిద్రమవుతున్నాయన్న ఆవేదన మహిళల్లో ఉందని పేర్కొన్నారు.

యాదాద్రి జిల్లా భువనగిరిలో తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమకారుల అలయ్​-బలయ్​ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొంటూ  బంగారు తెలంగాణ అంటే.. స్వచ్ఛమైన బంగారమే ఉండాలి కానీ, కల్తీ ఉండవద్దని ఎద్దేవా చేశారు.

తెలంగాణ స్వచ్ఛంగా, శుద్ధిగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమం 2002లో ప్రారంభం కాలేదని, 1950 నుంచి సాగుతోందని ఆయన చెప్పారు. విభేదాలు ఉండవచ్చు.. విమర్శలు చేయవచ్చు కానీ శతృత్వం ఉండకూడదని హితవు చెప్పారు. శతృత్వం వల్ల సమాజాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని హెచ్చరించారు.

ప్రభుత్వం కారణంగానే అభివృద్ధి జరిగిందనుకుంటే పొరపాటని దత్తాత్రేయ చురకలు అంటించారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం నడిచిందని ఆయన గుర్తు చేశారు. రక్తంతోనే తెలంగాణ ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణ ఏర్పడాలని, అన్ని వర్గాలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. వెనుకబడిన తెలంగాణ వద్దని చెప్పిన దత్తాత్రేయ,  దేశంలోనే తెలంగాణ నెంబర్​వన్​గా నిలవాలని కోరారు.

తెలంగాణ ప్రజలారా.. ఉద్యమకారులారా.. కళాకారులారా.. మేధావులారా.. మళ్ళీ మనందరం మరొక ఉద్యమం చేయాలని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపిచ్చారు.   తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా తెలంగాణ గడ్డ ఉందని చెబుతూ  తుఫాను తాకిడికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు.

తెలంగాణ  ఉద్యమానికి నేను ప్రత్యక్ష సాక్షిని. కులం, మతం, పార్టీలు, జెండాలతో సంబంధం లేకుండా అందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. సకలజనులు ఉద్యమబాట పట్టారు. పనులు పక్కన పెట్టీ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ జాతి ఆకలి అయినా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పొదని ఈటెల స్పష్టం చేశారు. 

తొమ్మిదేండ్లలోనే వందేండ్లకు సరిపోయేంత సంపదను దోచుకున్న కేసీఆర్​, తెలంగాణ తొలిదొంగ అని పలువురు వక్తలు విమర్శించారు. పెట్టుబడిదారుల కోసమే కేసీఆర్​ పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేసిండని విమర్శించారు. ధరణి ప్రజల కొంపలు ముంచిందని పేర్కొన్నారు.

సముద్రం లెక్క ప్రజలు ప్రశాంతంగా  ఉన్నారని, ఎన్నికల సమయంలో తుఫానులా విరచుకుపడి కేసీఆర్​ను దించేస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్​ రెండోసారి అధికారంలోకి రాగానే కేసీఆర్​ అసలు స్వరూపం బయటపడిందని విమర్శించారు.  ప్రగతి భవన్​ కేసీఆర్​ సొత్తు కాదని అంటూ ప్రగతి భవన్​ గేటు పగలగొట్టి.. ప్రవేశిస్తామని తేల్చి చెప్పారు.

అమరుల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య తెలంగాణ సాకారం కావాలంటే.. మరోసారి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అలయ్​-బలయ్​లో  మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్,  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే నగేశ్​, కరీంనగర్​ మాజీ జడ్పీ చైర్​పర్సన్​ తుల ఉమ, రాణి రుద్రమ, ఏపూరి సోమన్న, బండ్రు శోభారాణి మాట్లాడారు.