ఒడిశా రైళ్ల ఘోర ప్రమాదంపై ప్రపంచ నేతల సంతాపం

ఒడిశా లోని బాలసోర్‌లో జరిగిన ఘోర ప్రమాద సంఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రపంచ దేశాల నేతలు సంతాపం ప్రకటించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తదితరులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి తమ సంతాప సందేశాలు పంపారు. ఈ విషాదాన్ని బాధిత కుటుంబాలతో తాము పంచుకుంటామని. బాధితులు విషాదం నుంచి వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నామని ఒక టెలిగ్రాం ద్వారా పుతిన్ తన సందేశం పంపారు.

జపాన్ ప్రభుత్వం, ప్రజల తరఫున జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బాధితులు వేగంగా కోలుకోవాలని ఆశిస్తూ తన సంతాప సందేశం పంపారు. జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రి యోషిమషా హయషి తన సంతాప సందేశాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు పంపారు. ఈ ప్రమాద వార్త విని తీవ్ర ఆవేదన చెందానని, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానని సందేశంలో పేర్కొన్నారు.

ఈ క్లిష్ట సమయంలో కెనడా ప్రజలు భారత ప్రజలకు అండగా ఉంటారని కెనడా ప్రధాని జస్టిన్‌ట్రుడో తన సందేశంలో పేర్కొన్నారు. ప్రమాద వార్తలు, ఫోటోలు తన మనసును కలచి వేశాయని ట్రుడో తెలిపారు. భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని ప్రచండ ప్రమాదంలో జీవితాలను కోల్పోయిన వందల మంది కుటుంబాలకు సంతాపం ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈమేరకు ప్రధాని మోడీకి సంతాప సందేశం పంపారు.

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ బాధితులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీలంక విదేశాంగ మంత్రి అలిసబ్రీ , భూటాన్ ప్రధాని లోతే త్సెరింగ్ , ఇటలీ డిప్యూటీ ప్రధాని , విదేశీ వ్యవహారాల మంత్రులు, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు సబా కొరోసీ, తైవాన్ అధ్యక్షులు త్సాయి ఇంగ్ వెన్, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్, తమ సంతాప సందేశాలు పంపారు.