తీవ్ర ఆర్ధిక సంక్షోభం, ద్రవ్యోల్బణంలో పాకిస్తాన్

పాకిస్తాన్‌ను రాజకీయ సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభం కూడా వెంటాడుతూనే ఉంది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో పెరుగుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అక్కడ జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.  తాజాగా మే నెలలో వార్షిక ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 37.97 శాతానికి పెరిగినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.
ఇక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక కన్నా పాకిస్తాన్‌లోనే అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైంది.  శ్రీలంకలో మేలో వార్షిక ద్రవ్యోల్బణం 25.2 శాతం నమోదైంది. ఈ లెక్కల ప్రకారం దక్షిణ ఆసియా దేశాల్లో ఒక్క పాకిస్తాన్‌లోనే అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైంది.
కాగా, బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ విడుదల చేసిన డేటా ప్రకారం గత ఏడాది జులై నుండి ఈ ఏడాది మే నెల వరకు అంటే 11 నెలల కాలంలో మద్య పానీయాలు, పొగాకు వంటి ధరలు 123.96 శాతం, వినోదం- సంస్కృతి 72.17 శాతం, రవాణా 52.92 శాతం పెరిగాయి. ఇక పాడైపోని ఆహార పదార్థాల ధర కూడా 50 శాతానికి పైగా పెరిగాయి.  ఇక ఆహార పదార్థాలలో బంగాళదుంపలు, గోధుమపిండి, టీ, గోధుమలు, గుడ్లు, బియ్యం వంటి ధరలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మేలో వీటి ధరలు అత్యధికంగా పెరిగాయి.
ఇక ఆహారేతర విభాగంలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, మోటార్‌ ఇంధనాల, సబ్బులు, అగ్గిపెట్టెల ధరలు కూడా అత్యధికంగా పెరిగాయి.  ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉండడంతో ఆ ప్రభావం పాకిస్తాన్‌లోని పేద, మధ్యతరగతి కుటుంబాలపై పడుతోంది. ద్రవ్యోల్బణం ఒక్కో పాయింట్‌ పెరుగుతున్న కొద్దీ పేద, మధ్యతరగతుల వారి సంపాదన ఆవిరైపోతుందని కరాచీలోని మొహమ్మద్‌ సోహైల్‌ అనే ఫైనాన్షియర్‌ మీడియాకు తెలిపారు.
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం 36.4 శాతం. వినియోగదారుల ధరల సూచీలో తాజా పెరుగుదలతో ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో (జులై నుండి మే వరకు) సగటు ద్రవ్యోల్బణం 29.16 శాతంగా ఉంది. ఇది గతేడాది 11.29 శాతంగా ఉంది.  పాకిస్తాన్‌ బాహ్య రుణాలు, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు వంటి అనేక కారణాల వల్ల ఆ దశాన్ని ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలోనే పాక్‌లో రికార్డుస్థాయిలో ద్రవ్యోల్బణం నమోదువుతంది.