ఉన్నత స్థితికి భారత్ నేపాల్ సంబంధాలు

భారత్ నేపాల్ సంబంధాలను తాము హిమాలయాల స్థాయి ఉన్నతికి తీసుకువెళ్లుతామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సరిహద్దు వివాదాలు ఇతర జటిలతలను ఇదే స్ఫూర్తితో పరిష్కరించుకుంటామని చెప్పారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండత విస్తృతస్థాయి చర్చల తరువాత ప్రధాని మోదీ గురువారం మాట్లాడారు.

భారత్‌లో నాలుగురోజుల పర్యటనకు నేపాల్ నేత బుధవారం ఇక్కడికి వచ్చారు. ఇరువురు నేతలు ఇరుదేశాల మధ్య పటిష్ట సంబంధాల దిశలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలను రిమోట్ కంట్రోలు పద్ధతిలో జరిపారు. ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యం భవిష్యత్తులో సూపర్‌హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీమాంతర పెట్రోలియం పైప్‌లైన్ విస్తరణ, జలవిద్యుత్ విషయంలో మరింతగా సహకారం వంటి కీలక అంశాలకు సంబంధించి ఉభయ పక్షాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరుదేశాల మధ్య రవాణా సంబంధిత ఒప్పందాన్ని సవరించడం మరో కీలక మలుపుగా నిలిచింది.

తాము తొమ్మిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పొరుగుదేశం నేపాల్‌తో సంబంధాలకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నేపాల్‌కు తొలిసారి వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాల దిశలో హిట్ ఫార్మూలాను (హైవేస్, ఐ వేస్, ట్రాన్స్‌వేస్) ప్రతిపాదించినట్లు, ఇప్పుడు ఈ సంబంధాలు సూపర్‌హిట్ దిశకు వెళ్లుతాయని తెలిపారు.

ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా రామాయణ సర్క్యూట్‌ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మోదీ చెప్పారు. పొరుగు దేశానికి తగు ప్రాధాన్యత అనే మోదీ  ఆలోచన తనను ఆకట్టుకుందని ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని తెలిపారు. ఇరుదేశాల మధ్య స్నేహం చిరకాలానిది అని, బహుముఖమని చెప్పారు. ప్రధాని మోదీకి తొమ్మిదేళ్ల పాలన దశ పట్ల అభినందనలు తెలిపారు.

ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ గురువారం ఇంధనం, కెనెక్టివిటీ, వాణిజ్యం సహా అనేక రంగాలలో భారత్‌నేపాల్ సహకారాన్ని పెంపొందించుకునే విషయంలో విస్తృత చర్చలు జరిపారు. నేపాల్ ప్రధాని నాలుగు రోజుల పర్యటనపై బుధవారం భారత్ వచ్చారు.

68 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌మావోయిస్ట్ (సిపిఎన్‌మావోయిస్ట్) నాయకుడు 2022 డిసెంబర్‌లో అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. నేపాల్, భారత్ మధ్య ఇరుగుపొరుగు సంబంధాలున్నాయి. రెండు దేశాల ప్రజల్లో పెళ్లి సంబంధాలు కూడా ఉన్నాయి.

నలుదిక్కుల భూభాగమే ఉన్న నేపాల్ వస్తు, సేవల రవాణాకు భారత్‌పై ఆధారపడుతుంది. నేపాల్, భారత్‌లోని సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో 1850 కిమీ. సరిహద్దు కలిగి ఉంది. నేపాల్‌కు సముద్ర మార్గం భారత్ నుంచే. నేపాల్ భారత్‌ల మధ్య శాంతి, స్నేహ ఒప్పందం 1950లో జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలున్నాయి.