చీతాల సంరక్షణలో లోపాలు లేవని స్పష్టం

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో రెండు నెలల వ్యవధిలో ఆరు చీతాల మృతిపై విమర్శలు చెలరేగడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ  చీతాల సంరక్షణలో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేశాయి. చీతాలకు మధ్యప్రదేశ్ అనుకూల ప్రదేశం కాకపోయినా అక్కడకు తీసుకొచ్చారని కొందరు చేస్తున్న వాఖ్యాలను కొట్టిపారవేసారు. రెండు నెలల వ్యవధిలో మూడు కూనలు సహా ఆరు చీతాలు మృతి చెందడంపై ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ ‘‘చీతాల మృతిపై ఎటువంటి అలసత్వం లేదు… మూడు చిరుత పిల్లల మరణాల విషయంలో కూడా ప్రపంచ వన్యప్రాణుల సాహిత్యం చిరుతల్లో 90% శిశు మరణాలను స్పష్టంగా పేర్కొంది” అని  తెలిపారు.

‘రెండు ఆఫ్రికన్ దేశాల నుంచి కునో నేషనల్ పార్కులోకి తీసుకొచ్చిన చిరుతలతో మేము ఎలాంటి ట్రయల్స్ చేయలేదు. చిరుతలు కలిసి నివసిస్తాయి కాబట్టి మగ, ఆడ చిరుత సంభోగంలో కూడా ఎటువంటి ప్రయోగాలు జరగలేదు. ఇది డాక్యుమెంట్ చేసిన సాక్ష్యం. ఆఫ్రికన్ నిపుణుల నుంచి క్లియరెన్స్ ఆధారంగా జరిగింది’ అని కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ సీపీ గోయల్ స్పష్టం చేశారు.

సంభోగం సమయంలో రెండు, మగ చిరుతలతో జరిగిన ఘర్షణలో ఓ ఆడ చీతా చనిపోయాయి. మరోవైపు, కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన చీతాలు ఇక్కడ మృతి చెందడం గురించి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఇక్కడి వాతావరణానికి అవి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

అయితే, ఇక్కడే పుట్టిన మూడు పసికూనలు మృతి చెందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.  చీతాల ప్రాజెక్ట్ కింద చిరుతల సంరక్షణ, నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, ఉద్యోగులను ఎంపిక చేసి దక్షిణాఫ్రికా, నమీబియాలకు స్టడీ టూర్ కోసం పంపుతామని చెప్పారు. రక్షణ, సంరక్షణ, ప్రచారం, ప్రతిపాదిత చిరుత రక్షణ దళం కోసం ఆర్థిక వనరులతో సహా సాధ్యమైన అన్ని సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

భోపాల్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డాక్టర్ విజయ్ షా, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో చిరుత ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి యాదవ్ చర్చించారు. అటు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్ఎం)లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్ టి సి ఎ) 23వ సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ తమది పులుల రాష్ట్రమని, ఈ అంశం ఎంతో ప్రతిష్టాత్మకమని తెలిపారు. ప్రాజెక్ట్ చీతాకు విజయవంతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చేతల మనుగడ రేటు తక్కువని ఆయన పేర్కొన్నారు. ‘చిరుత పిల్లల పుట్టుక, మనుగడ రేటు గురించి సమాచారం ప్రారంభంలోనే ఇవ్వబడింది.. చిరుత ప్రాజెక్టుకు సంబంధించిన సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రాజెక్టు పురోగతి సంతృప్తికరంగా ఉంది’ అని ఆయన చెప్పారు.

కాగా, చిరుతలకు ప్రత్యామ్నాయ ఆవాసాల కోసం గాంధీ సాగర్ అభయారణ్యంలో అవసరమైన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్చి 27 నుంచి ఇప్పటివరకు కునో నేషనల్ పార్కులో ఆరు చీతాలు మృతి చెందాయి. వీటిలో మూడు ఇక్కడే పుట్టిన కూనలు కూడా ఉన్నాయి.