
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈ నెల 29 వ తేదీ ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జిఎస్ఎల్ వి -ఎఫ్12 రాకెట్ ను ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ రాకెట్ ద్వారా ఎన్ వి ఎస్ -01 అనే నేవిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
శ్రీహరికోట లోని రెండవ ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగం జరుగుతుంది.2232 కిలోల బరువు ఉండే ఎన్ వి ఎస్ -01 అనే నేవిగేషన్ ఉపగ్రహాన్ని భూదృవ కక్షలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం మొబైల్ ఫోన్ లలో వాడుతున్న జిపిఎస్ తరహాలో నేవిగేషన్ ఉపగ్రహం సేవలు అందిస్తుంది.
దీంతో పాటుగా భూగోళ,సముద్ర మార్గాలలో దారి చూపడానికి వైమానిక ప్రయోజనాల కోసం ఉపయోగ పడుతుంది. వ్యవసాయ రంగానికి, విమానాల సర్వీసులకు, అత్యవసర ప్రయోజనాలకు, సముద్రంలో మత్య సంపదను గుర్తించడానికి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రయోజనాల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
51.7 మీటర్లు ఎత్తు, 420 టన్నులు బరువు కలిగిన జిఎస్ఎల్వి -ఎఫ్12 రాకెట్ మొత్తం 3 స్టేజిలు ఉంటుంది. రాకెట్ ప్రయోగం జరిగిన అనంతరం 18 నిమిషాల నుండి 19 నిమిషాల మధ్య సమయంలో ఎన్ వి ఎస్ -01 ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షకు చేర్చడం జరుగుతుంది. ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు సేవలు అందించే విదంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. గతంలో ప్రయోగించి ఉన్న నేవిగేషన్ ఉపగ్రహాలకన్నా అత్యంత అధునాతన సాంకేతిక పరికరాలను ఈ ఉపగ్రహంలో పొందుపరచారు.
More Stories
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనే లేదు
మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్ట్