అమెరికా మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చైనా హ్యాకర్లు

అమెరికా కీలక మౌలిక సదుపాయాలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు టెక్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ ఆరోపించింది. భవిష్యత్తులో అమెరికా, ఆసియా మధ్య కీలక కమ్యూనికేషన్‌లకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొది.
 
గువామ్‌లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరానికి చెందిన వెబ్‌సైట్‌ సహా పలు కీలక సైట్లు చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఉన్నాయని మైక్రోసాప్ట్‌ తెలిపింది. ఈ హ్యాకర్లను టెక్‌ దిగ్గజం ‘వోల్ట్‌ టైఫూన్‌’గా పేర్కొంది. వీరు 2021 మధ్య నుంచి యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది.

కమ్యూనికేషన్స్‌, తయారీ, యుటిలిటీ, రవాణా, నిర్మాణం, మేరీటైమ్‌, విద్య, ఐటీ రంగాల్లోని సంస్థలపై హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఇదే విషయంపై అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ, ఎఫ్‌బీఐ, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, బ్రిటన్‌లోని సంబంధిత సంస్థలు సైతం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

ఇటీవల హ్యాకర్ల కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించాయి. సాధారణంగా ఇలాంటి హ్యాకింగ్‌ ఉత్తర కొరియా, ఇరాన్‌, రష్యా నుంచి జరుగుతుంటుందని పేర్కొన్నారు. చైనా నుంచి చాలా అరుదుగా ఇలాంటి కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాప్ట్‌ ప్రకటనకు చాలా ప్రాధాన్యం ఉందని వివరించారు.