సంపన్న దేశాలు కృతఘ్నతతోనే వ్యవహరిస్తుంటాయి 

సంపన్న దేశాలు తరచూ కృతఘ్నతతోనే వ్యవహరిస్తూ ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ  విమర్శించారు. వారి పట్ల మనం నమ్మకం పెంచుకుంటే చివరికి అవసరం అయినప్పుడు వారు ఎటువంటి సాయానికి ముందుకు రారని చెబుతూ అవసరానికి ఆదుకోని వారి వైఖరిని ఎమనాల్సి ఉంటుందని ప్రశ్నించారు.

జపాన్ జి 7 సమ్మిట్ తరువాత పపూవా న్యూ గియానాకు వచ్చిన ప్రధాని మోదీ  అక్కడ జరిగిన మూడవ ఇండియా 14 పసిఫిక్ ఐలాండ్ దేశాల సంయుక్త సదస్సులో (ఫిపిక్ ) మాట్లాడారు. సంపన్న దేశాలను తరచూ అణగారిన స్థితిలో ఉన్న దక్షిణాది దేశాలు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటాయి. తమ కష్టాలలో ఆదుకుంటాయని సంపన్న దేశాల వైపు చూస్తాయి. అయితే ఆ అభివృద్ధి చెందిన దేశాల వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.

పలు కారణాలతో ఇప్పుడు పలు రకాల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు తలెత్తాయి. ఓ విధంగా దీనికి సంపన్న దేశాల ధోరణి కారణం. అయినా ఇంధన, ఆహార, ఔషధ, ఎరువుల సరఫరాల విషయాలలో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు సంపన్న దేశాలు ముందుకు రావడం లేదని ప్రధాని విమర్శించారు.

వారి నుంచి సాయం అందుతుందనుకుంటే వారు విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నారని, దీనితో పేద దేశాల పరిస్థితి దయనీయంగా ఉందని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి దశలో గ్లోబల్ సౌత్ తీవ్రస్థాయిలో చిక్కుల్లో పడింది. పలు ఆటుపోట్లు ఎదురయ్యాయని, తరచూ వచ్చిపడే వాతావరణ, పర్యావరణ సవాళ్లు, ప్రకృతి వైపరీత్యాలు, ఆకలి దప్పులు, అనారోగ్య సమస్యల నడుమ పరిస్థితి దయనీయంగా ఉన్న దేశాల పట్ల ఎటువంటి స్పందన ఉందనేది తెలిసిందే అంటూ ప్రధాని ఘాటుగా మండిపడ్డారు.

మరెన్నో సరికొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయని తెలిపిన ప్రధాని క్లిష్ట పరిస్థితుల నడుమ ఈ మిత్ర పసిఫిక్ దీవుల దేశాలకు భారతదేశం వెన్నుదన్నుగా నిలవడం పట్ల తాను గర్విస్తున్నానని తెలిపారు.

ప్రపంచ వేదికపై భారతదేశపు నాయకత్వ పటిమను ఈ వేదిక నుంచి పపూవా న్యూ గియానా ప్రధాని జేమ్స్ మారాపై కొనియాడారు. భారతదేశం అందిస్తున్న సాయానికి ధన్యవాదాలు చెప్పారు. గ్లోబల్ సౌత్‌కు ప్రధాని మోదీ  నాయకుడు అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త అధికార దాహానికి, చెలగాటానికి మన మంతా బలి అవుతున్నామని పేర్కొంటూ ఈ దశలో ప్రపంచ వేదికలపై భారత నాయకత్వానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

కాగా, భారత్ – 14 పసిఫిక్ ద్వీప దేశాల సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ న్యూజీలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్‌తో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తృత్తిని విశ్లేషించారు. వాణిజ్య వ్యాపార దౌత్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని నేపథ్యంలో నిర్ణయించారు.

ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారాలు

పాపువా న్యూ గినియా పర్యటనలో ప్రధాని మోడీకి రెండు దేశాలకు సంబంధించిన అత్యున్నత పురస్కారాలు లభించాయి.  ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఫిజీ-కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ-అత్యున్నత గౌరవాన్ని ఫిజీ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. ఫిజియేతరులు అతి కొద్దిమంది మాత్రమే ఈ పురస్కరాన్ని అందుకోవడం విశేషం. వారిలో ప్రధాని మోదీ ఉన్నారు.

ఇదే పర్యటనలో పాపువా న్యూ గినియా కూడా అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించింది. దీంతో భారతదేశానికి అపూర్వమైన గౌరవం లభించినట్లయింది.