రష్యా – ఉక్రెయిన్ యుద్ధం అత్యంత అమానవీయం

రష్యా , ఉక్రెయిన్ యుద్ధం అత్యంత అమానవీయమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా, మొత్తం ప్రపంచానికే సవాలుగా మారిందని మోదీ స్పష్టం చేశారు. ‘‘ఈ యుద్ధం చాలా పెద్ద సమస్య. ప్రపంచ దేశాలపై ఇది పెను ప్రతికూల ప్రభావం చూపుతోంది’’ అని మోదీ పేర్కొన్నారు.
 
జీ 7 సదస్సులో పాల్గొనడానికి జపాన్ వెళ్లిన భారత ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని భారత ప్రధాని మోదీ నేరుగా కలవడం ఇదే మొదటిసారి.
ఈ ఇద్దరు నేతలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత పలుమార్లు ఫోన్ లో, వర్చువల్ గా మాట్లాడుకున్నారు. “ఇది ఒక రాజకీయ అంశమో లేక ఆర్థిక పరమైన అంశమో కాదు.. ఈ యుద్ధం మానవీయతకు సంబంధించినది. మానవ విలువలకు సంబంధించినది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మోదీ సమావేశమైన విషయాన్ని భారత ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ధారించింది.