తహవూర్ రాణా భారత్‌కు అప్పగింత!

26/11 ముంబై ఉగ్రదాడుల ఉదంతంలో నిందితుడు తహవూర్ రాణాను భారతదేశానికి విచారణకు తరలించే ప్రయత్నం విజయవంతం అయింది. ఈ పాక్ సంతతికి చెందిన కెనెడియన్ వ్యాపారవేత్తను విచారణకు భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా కాలిఫోర్నియా కోర్టు అనుమతిని ఇచ్చింది. 2008 నాటి దారుణ దాడులకు సంబంధించి రాణా పాత్ర ఉందని, ఆయన దాడులకు ప్రధాన సూత్రధారి అని భారత దర్యాప్తు సంస్థలు నిర్థారించాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నెలరోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్లుతున్న దశలోనే న్యాయస్థానం నుంచి ఈ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.  62 సంవత్సరాల రాణాను భారత్ అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల అప్పగింతల ఒప్పందం పరిధిలో భారత్‌కు పంపించాలని ఇటీవలే మెజిస్ట్రేట్ జడ్జి జాక్వెలిన్ చూల్జియన్ 48 పేజీల తీర్పు వెలువరించారు.

భారతదేశం సమర్పించిన అన్ని పత్రాల పరిశీలన, అప్పగింతకు ఉన్న కారణాలను పరిశీలించిన తరువాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యక్తి అప్పగింతకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ తగు విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అప్పటి ఉగ్రదాడులకు రాణా పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడైంది.

ప్రస్తుతం రాణా అమెరికాలో 14 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.  కేసులో ప్రధాన నిందితుడు అయిన డేవిడ్ హెడ్లీకి రాణా సన్నిహితుడు. ముంబై ఉగ్రదాడులకు ముందు రాణా కొందరితో కలిసి ముంబైలో రెక్కీ నిర్వహించి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. అప్పటి ఉగ్రవాద దాడులలో 166 మంది చనిపోయారు. వీరిలో ఐదారుగురు అమెరికన్లు, కొందరు విదేశీయులు కూడా ఉన్నారు.