ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తహ్రీర్ తో లింకులపై మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. భోపాల్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ సంస్థతో హైదరాబాద్ లింకులను ఏటీఎస్ ట్రేస్ చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి చాంద్రాయణగుట్ట, హఫీజ్ బాబా నగర్లో ఏటీఎస్ సోమవారం సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థ నెట్వర్క్ కార్యకలాపాలను ఏటీఎస్ ట్రేస్ చేస్తున్నది. దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్నారన్న సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈనెల 9న సోదాలు చేసిన విషయం తెలిసిందే.
గోల్కొండలో జరిపిన సోదాల్లో దక్కన్ కాలేజీలో హెచ్ఓడీగా పనిచేస్తున్న మహ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్దుల్ రెహమాన్ అలియాస్ దేవీప్రసాద్ పాండ్య, డెంటల్ డాక్టర్ షేక్ జునైద్, హఫీజ్ బాబానగర్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అబ్బాస్ అలియాస్ వేణుకుమార్, మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట మఖ్బూం నగర్కు చెందిన మహ్మద్ హమీద్, జవహర్ నగర్ లోని శివాజీ నగర్కు చెందిన మహ్మద్ సల్మాన్లను అరెస్టు చేశారు.
వారితో పాటు భోపాల్లో అరెస్టయిన మరో 11 మందిని కోర్టు అనుమతితో ఏటీఎస్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సహా ఆరుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ నిర్వహిస్తున్న కార్యకలాపాలతో అనుమానితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
నిందితుల కాల్ డేటా, వాట్సాప్ డేటా, సోషల్ మీడియా అకౌంట్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే హఫీజ్ బాబానగర్కు చెందిన మహ్మద్ అబ్బాస్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి ఆపరేషన్ చేశారు. ఈ సోదాల్లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్
రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎస్ఐబీ చీఫ్ కోసం పిటిషన్