‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఎందుకు నిషేధించారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా సుప్రీంకోర్టు నిలదీసింది.
పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ద్వేషం లేదా హింసాత్మక సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఈ సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే శాంతిభద్రతల కారణాలతో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు తమిళనాడులోని థియేటర్ల యజమానులు ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ మూవీ షోను నిలిపివేశారు. కాగా, పశ్చిమ బెంగాల్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై నిషేధం, తమిళనాడులో ఈ మూవీని ప్రదర్శించక పోవడంపై సినీ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీని వల్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపింది. దేశమంతా ఈ సినిమాను ప్రదర్శిస్తుండగా బెంగాల్లో నిషేధం విధించడాన్ని కోర్టు ప్రశ్నించింది.
‘దేశంలోని ఇతర ప్రాంతాల కంటే పశ్చిమ బెంగాల్ భిన్నం కాదుగా. ఈ సినిమా ప్రదర్శనను ఎందుకు అనుమతించడం లేదు?’ అని నిలదీసింది. ఈ సినిమాను నిషేధించడానికి కారణాలను చెప్పాలంటూ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించేందుకు తీసుకున్న అన్ని చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది.
More Stories
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం