స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై తీర్పు వాయిదా

దేశంలో స్వలింగ వివాహాల చట్టబద్ధతను కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదోపదవాదాల పర్వం ముగిసింది. అత్యంత కీలక సామాజిక ప్రకంపనల ఈ వినూత్న వైవాహిక ఘట్టం చట్టబద్ధమా ? కాదా అనే విషయంపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినట్లు గురువారం ప్రకటించింది.

తీర్పు ఈ వేసవి సెలవుల తరువాత వెలువరించే వీలుంది. పదిరోజుల పాటు ఈ వ్యాజ్యాలపై వాదోపవాదాలు సాగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎఎం సింఘ్వీ, రాజు రామచంద్రన్, కెవి విశ్వనాథన్, ఆనంద్ గ్రోవర్, సౌరభ్ కిర్పాల్ తమ వాదనలు విన్పించారు. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎస్‌ఆర్ భట్, హిమా కొహ్లీ, పిఎస్ నరసింహ సభ్యులుగా ఉన్నారు.

దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగపరమైన కీలక విషయాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని, ఇటువంటి వాటిలో సహజంగానే పలు విశ్వాసాల విషయాలు, సెంటిమెంట్లు, సంప్రదాయాల సంగతులు ప్రస్తావనకు వస్తాయని తెలిపిన ధర్మాసనం విచారణల దశలో సేమ్ సెక్స్ పెళ్లిళ్లను అంగీకరిస్తే సరిపోతుందనే అభిప్రాయానికి మొగ్గుచూపింది.

అయితే బుధవారం జరిగిన విచారణ దశలో కేంద్రం తన వాదనను విన్పించింది. దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చర్యలు ఎటువంటివి అయినా అనుచిత కార్యాచరణకు దారితీస్తాయని పేర్కొంది. సంబంధిత విషయంపై కేంద్రం పట్ల ఎటువంటి రాజ్యాంగపరమైన ప్రకటిత ఆదేశాలు వెలువడ్డా, చట్టబద్ధత దిశలో చర్యలు తీసుకున్నా దీని వల్ల తలెత్తే పరిణామాలు తీవ్రస్థాయిలోనే ఉంటాయని పేర్కొంది.

క్షేత్రస్థాయిలో ప్రత్యేకించి ప్రజలలో తలెత్తే పరిణామాలను కోర్టులు అంచనా వేయగలవా? పరిస్థితిని ఎదుర్కొగలవా? అని ప్రశ్నించింది. ధర్మాసనం స్పందిస్తూ తీర్పు పూర్తిగా నిర్ధేశిత ఆదేశాల తీరులో ఉంటుందని అంతా భావిస్తున్నారని, అయితే ఓ రాజ్యాంగ ధర్మాసనం పరిధిలోకి వచ్చిన ఈ విషయంపై తాము కేవలం సంబంధిత విషయంపై ప్రస్తుత స్థితిగతులను బేరీజు వేసుకుంటామని, ఈ మేరకు పరిమితుల రేఖలను నిర్దేశించుకోవడం జరుగుతుందని తెలిపారు.

కాగా స్వలింగ వివాహాల అంశాలపై తమకు ఇప్పటికైతే రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అసోంల నుంచి అభిప్రాయాలు అందాయని, అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు స్వలింగ సంపర్క అంశం చట్టబద్ధతకు దాఖలైన పిటిషనర్ల వాదనలను వ్యతిరేకించాయని కేంద్రం తెలిపింది.