జీవో నంబర్ 1 కొట్టేసిన ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. జీవో నంబర్ 1 ను సస్పెండ్ చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.  రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో జీవో నంబర్-1 తీసుకొచ్చింది. ఈ జీవో నంబర్-1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో పాటూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.
 
ఈ పిటిషన్లపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పును వెల్లడించింది.. జీవో నంబర్ 1 ను కొట్టేసింది.
 
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ జీవోను తెచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ జీవోలో కొన్ని కీలకమైన నిబంధనలు విధించారు. 1861 పోలీస్‌ చట్టం ప్రకారం ఈ ఉత్తర్వులను ఇచ్చారు.
 
జీవో నంబర్ 1 ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రోడ్లలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సభల నిర్వహించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా జనాలకు ఇబ్బందులు లేకుండా రోడ్లకు దూరంగా, జన సంచారం పెద్దగా లేని చోట్ల సభలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.