మావోయిస్టులకు రూ.77లక్షలను తరలిస్తున్న నలుగురు అరెస్ట్

చత్తీస్ గఢ్ మావోయిస్టులకు రూ.77లక్షల నగదు, మెడికల్ కిట్టు, జిలెటిన్ స్టిక్స్, నాలుగు సెల్ ఫోన్లు, ట్యాబ్ మూడు స్మార్ట్ వాచెస్ సరఫరా చేస్తున్న నలుగురిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోలీసులు పట్టుకున్నారు.  జయశంకర్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సురేందర్ రెడ్డి నిందితులను అరెస్టు చూపి, కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
 
పట్టుకున్న వారిలో  ఏ1 మొదటి వ్యక్తి అబ్దుల్ అజీజ్ (63), కరీంనగర్, బీడీ కాంట్రాక్టర్; ఏ2. మొహమ్మద్ అబ్దుల్ రజాక్ (60) హుజురాబాద్, ప్రస్తుతం కరీంనగర్ నివాసి; ఏ3 జనగామ రాఘవ్ (26), చందూరు, భూపాలపట్నం తాలూకా బీజాపూర్ జిల్లా, చతిస్గడ్ రాష్ట్రం; ఏ4. కౌసర్ అలీ (27), పశ్చిమ బెంగాల్ రాష్ట్రం.
 
ఇక పరారీలో ఉన్న మరో ఏడుగురు మావోయిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతంగా పనిచేసిన ఓఎస్డీ అశోక్ కుమార్, కాటారం డిఎస్పి జి. రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ రంజిత్ రావు, కాటారం ఎస్సై శ్రీనివాస్, మాహా దేవ్పూర్ ఎస్సై రాజకుమార్, కాలేశ్వరం ఎస్సై లక్ష్మణరావు, కొయ్యూరు ఎస్ఐ నరేష్, అడవి ముత్తారం ఎస్ఐ సుధాకర్ లను ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అభినందించారు.