ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ వెళ్లే యాత్రికుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా బుధవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజం, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఇబాదుల్లా, ఎస్. ఖాదర్, షేక్ మహ్మద్ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ఒక ఎంబర్కేషన్ పాయింట్ కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. హైదరాబాద్ లేదా బెంగళూరు ఎంబర్కేషన్ పాయింట్లతో పోలిస్తే విజయవాడ ఎబార్కేషన్ పాయింట్ నుంచి హజ్కు వెళ్ళే హాజీలకు రూ.83,000 అధికంగా ఖర్చవుతోందని, ధర తగ్గింపు విషయాన్ని పరిశీలించవలసినదిగా కేంద్రమంత్రిని కోరామన్నారు.
ధర తగ్గించడం కుదరని పక్షంలో ఏపీ హాజీలు హైదరాబాదు లేదా బెంగళూరు ఎంబర్కేషన్ పాయింట్ల నుంచి వెళ్ళే సదుపాయం కల్పించమని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ కొత్తది కావడం వల్ల టెండర్లలో విమానయాన సంస్థలు ధర అధికంగా కోట్ చేయడం వల్ల ఛార్జీలు పెరిగాయని స్మృతి ఇరానీ తమకు వివరించారని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.తమ అభ్యర్థనలపై ఆమె సానుకూలంగా స్పందించారని, ఈ అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడతామన్నారని హామీ ఇచ్చారని తెలిపారు. జూన్ 7 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు 120 మంది హజీలతో ఒక విమానం విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ నుంచి సౌదీ వెళ్లనుందని తెలిపారు.
ఏపీ హాజీలు ధర అధికంగా చెల్లించాల్సిన పక్షంలో ఆ వ్యాయభారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంతోషంగా భరిస్తుందని అంజద్ బాషా ప్రకటించారు. హాజీలకు ట్రైనింగ్ క్యాంప్లు నిర్వహిస్తామని, విడిది ఏర్పాట్లు చేసి హజ్కు పంపిస్తామని ఆయన తెలిపారు.
More Stories
మూడు పార్టీల మేనిఫెస్టో విడుదల రేపే
ఇసుక అక్రమ తవ్వకాలపై జగన్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ
నిప్పుల గండంగా మారిన తెలుగు రాష్ట్రాలు