‘ది కేరళ స్టోరీ’ని ప్రజలకు దూరం చేసే హక్కు ఎవరికుంది?

సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లను కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? అని ప్రముఖ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరు చెప్పి.. ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనని అడ్డుకుంటున్న ప్రభుత్వాలపై ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
 
ప్రభుత్వాలనే ఎన్నకునే ప్రజలకు ఏ సినిమా చూడాలో, ఏ సినిమా చూడకూడదో అనే విజ్ఞత లేదని అనుకుంటున్నారా? అని ఆమె నిలదీశారు. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా? అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం అని ఆమె స్పష్టం చేశారు.
 
 ప్రజలకు ఉన్న ఆ విజ్ఞతని కొన్ని వర్గాలు, చివరికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ చేతుల్లోకి లాక్కోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  మనది ప్రజాస్వామిక దేశం. జనం తమ విజ్ఞతతో ప్రభుత్వాలనే ఎన్నుకుంటున్న రోజుల్లో ఒక సినిమాని చూసి, అందులో ఏ అంశాల్ని స్వీకరించాలో, వేటిని తిరస్కరించాలో ప్రజలకి తెలియదని అనుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించారు.
 
చివరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ వర్గాలకి భయపడి సినిమా ప్రదర్శనకు ఆటంకాలు సృష్టించడం దారుణం అంటూ ఆమె మండిపడ్డారు.  గతంలో ది కశ్మీర్ ఫైల్స్  సినిమా విషయంలోనూ ఇలాగే కొన్ని వర్గాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండని ఆమె హితవు చెప్పారు.
 
సినిమా ప్రదర్శనని ఆపగలరేమో కానీ అందులోని సత్యం మాత్రం గుండెల్ని చీల్చుకుని మనసుల్లో నాటుకోవడం ఖాయమని గుర్తించాలని ఆమె తెలిపారు. ఒక సినిమా చూస్తేనే శాంతిభద్రతలు చెయ్యి దాటిపోయే సమస్య ఆ నిషేధించిన 3 రాష్ట్రాలలో ఉండటం, మిగతా దేశంలోని 27 రాష్ట్రాలకు ఆ పరిస్థితి లేదంటే అది ఆ నిషేధించిన రాష్ట్రాల పాలనా వైఫల్యమే గదా? అంటూ ఆమె ఎద్దేవా చేశారు. లేక మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించని మరో విధానం
అవుతుందా? అంటూ నిలదీశారు.