ప్రత్యక్ష ప్రసారంతో సామాన్యుల హృదయాల్లోకి న్యాయస్థానాలు 

కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారాలు చేయడం  న్యాయస్థానాలు సామాన్య ప్రజల హృదయాలకు చేరువ కావడానికి దోహదం చేశాయని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయపడింది.  అయితే ఈ ప్రత్యక్ష ప్రసారాలు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూడడం కోసం ఈ ప్రసారాలు ఇంగ్లీషుతో పాటుగా మిగతా భాషల్లోను ఏకకాలంలో ప్రసారమయ్యేలా చూడడం కోసం టెక్నాలజీని ఉపయోగించే విషయాన్నికూడా తాము పరిశీలిస్తున్నామని కూడా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
 
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాగం ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఎనిమిదో రోజు వాదనలు కొనసాగుతున్న సమయంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
 
ఈ వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల జనం ఈ అంశంపై ఆలోచించడం మొదలుపెట్టారని. అదే దీని వల్ల కలిగిన ముఖ్యమైన మార్పు అని మధ్యప్రదేశ్ తరఫున హాజరవుతున్న సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది  తెలిపారు.
 
దీనిపై సిజెఐ చంద్రచూడ్ సందిస్తూ కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం ఈ న్యాయస్థానం సామాన్య ప్రజలకు చేరువ అయ్యేలా చేసిందని పేర్కొన్నారు. అయితే ఒకే ఒక ఇబ్బంది ఉందని, అదేమిటంటే వాదనలు ఇంగ్లీషులో కొనసాగుతున్నందున మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారని ద్వివేది చెప్పారు.
 
తాము ఈ దిశగా కూడా కృషి చేస్తున్నామని పౌరులందరూ అర్థం చేసుకునేందుకు వీలుగా ఏకకాలంలో ప్రొసీడింగ్స్‌ను వివిధ భాషల్లో ప్రసారమయ్యేలా చూడడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.  ‘మేము దానిపై కూడా పనిచేస్తున్నాము. కోర్టులో జరిగే వాదనలు సాంకేతికత సహాయంతో ట్రాన్స్‌క్రిప్ట్‌లను అనుసరించి పౌరులకు అర్థమయ్యే బాషలలో ఏకకాలంలో అందించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము’ అని చంద్రచూడ్‌ చెప్పారు.
 
ఒక వ్యక్తి ఇంగీషులో మాట్లాడుతూ ఉంటే జపాన్ భాషతో పాటుగా వేర్వేరు భాషల్లో వినే వీలు సాంకేతికత వల్ల సాధ్యమవుతుందని జమైత్ ఉలేమాఇహింద్ తరఫున వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు.