చత్తీస్​గఢ్​లో మావోయిస్టు దంపతుల మృతి

చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బెజ్జి పోలీస్​స్టేషన్ పరిధిలోని దంతేసపురం అడవుల్లో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో  మావోయిస్టు దంపతులు చనిపోయారు. వీరిని గొల్లపల్లి ఏరియా కమాండర్​ మడకం ఎర్రా, పొడియం భీమేలుగా గుర్తించారు.  ఎర్రాపై రూ.8 లక్షలు, పొడియం భీమేపై రూ.3 లక్షల రివార్డు ఉందని ఎస్పీ సునీల్​శర్మ చెప్పారు.

గొలపల్లి లోకల్ ఆర్గనైజేషన్ స్కాడ్ (ఎల్‌ఒఎస్) దాదాపు 35 మంది నక్సల్స్ బృందం ఉన్నట్టు సమాచారం అందడంతో డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్, కోబ్రా బృందాలు బెజ్జి అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి గాలింపు చేపట్టాయని ఎస్‌పి చెప్పారు. దంతేష్‌పురం అటవీ ప్రాంతాన్ని డిఆర్‌జి పెట్రోలింగ్ బృందం దిగ్బంధం చేయడంతో ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.

ఈ క్రమంలో మావోయిస్టులు గుట్టపై నుంచి బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాల్పులు ఆగిపోయాక ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మడకం ఎర్రా, ఆయన భార్య పొడియం భీమే మృతదేహాలు కనిపించాయి.  బలగాలు బయటకు వచ్చే సమయంలో మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉండడంతో  అదనపు బలగాలను దంతేసపురం అడవుల్లోకి పంపించారు.

మావోయిస్టుల మృతదేహాలతో పాటు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, సామగ్రి తీసుకొచ్చారు. ఎన్​కౌంటర్​లో 303 తుపాకీతో పాటు కంట్రీమేడ్ ​పిస్టల్, డిటోనేటర్లు, మందుపాతర తయారు చేయడానికి ఉపయోగించే  వస్తువులు, వైర్లు, బుల్లెట్లు, మందులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ప్రకటించారు. మృతి చెందిన మావోయిస్టులపై వివిధ దాడులు, ఆయుధాలు ఎత్తుకెళ్లిన కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నాయని చెప్పారు.