హిందూపురం సీఐపై హైకోర్టు ఆగ్రహం

హిందూపురం సీఐ ఇస్మాయిల్‌పై ఏపీ హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ అధికారిపై దాడి చేయడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. సీఐకు ఎంత ధైర్యం అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐ చర్య కోర్టు పరిపాలన విధులకు ఆటంకం కలిగించేలా ఉందని వ్యాఖ్యానించింది.

సీఐపై కోర్టు దిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అడ్వకేట్ కమిషన్, కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటనలో సీఐ ఇస్మాయిల్‌పై ధర్మాసనం సుమోటో పిల్ నమోదు చేసింది. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

హిందూపురంలో గిరిష్ అనే వ్యక్తిని అక్రమ నిర్బంధం చేశారంటూ అక్కడి కోర్టులో పిటిషన్ వేసే సమయంలో కోర్టు అడ్వకేట్ కమిషనర్‌, సిబ్బందిని అక్కడికి పంపింది. పోలీస్ స్టేషన్‌లో గిరిష్ ఉండడం, చిత్రహింసలకు గురిచేయడంతో అతనిని కోర్టులో హాజరుపరచాలని అడ్వకేట్ కమిషనర్‌ చెప్పగా, సీఐ ఇస్మాయిల్‌ అడ్వకేట్ కమిషనర్‌, కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలపై జిల్లా జడ్జి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

అధికారులు ఇచ్చిన నివేదికను జిల్లా కోర్టు రాష్ట్ర హైకోర్టుకు పంపగా దానిని రిజిస్ట్రార్  ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు. దీనిపై వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి దీనికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వెంటనే తగిన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.