బెంగళూరులో భారీ రోడ్ షో ప్రారంభించిన మోదీ

కర్ణాటక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకోవడంతో ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగసభలతో కర్ణాటక ఎన్నికల ప్రచారం వాడివేడిగా నడుస్తోంది.

చివరి దశకు చేరుకున్న ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ  స్వయంగా రంగంలోకి దిగారు. మే6, 7 తేదీల్లో బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహించనున్నారని ఇప్పటికే బీజేపీ అధికారికంగా ప్రకటించగా, తాజాగా ప్రధాని రోడ్ షో అత్యంత అట్టహాసంగా శనివారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ భారీ రోడ్ షో 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగింది. దాదాపు 10 లక్షల మంది ఈ మెగా రోడ్ షోలు పాల్గొన్నట్లు చెబుతున్నారు

ఈ రోడ్ షో జేపీ నగరంలోని బ్రిగేడ్ మిలీనియం నుంచి బెంగళూరు సెంట్రల్‌లోని మల్లేశ్వరంలోని మారమ్మ సర్కిల్ వరకు మధ్యాహ్నం వరకు సాగింది. ప్రధాని మోదీ  చేపట్టిన ఈ భారీ రోడ్ షోకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహిని మధ్య ఈ రోడ్ షో సాగుతుండగా, ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రధానిపై పువ్వులు చల్లుతూ మద్దతు పలికారు. ఈ క్రమంలోనే అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బెంగళూరులోని దాదాపు 34 రోడ్లను మూసి వేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలు మోహరించి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇంతకుముందు మే 6న 10 కిలోమీటర్లు, 7న 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించాలని భావించారు. కానీ ఆదివారం నీట్ పరీక్ష వల్ల ఉన్నందువల్ల ఇవాళ 26 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తుండగా, ఆదివారం తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు.

ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ఇది జరగనుంది. మొత్తం రెండు రోజుల పాటు కర్ణాటకలో మోదీ రోడ్ షో జరగనుంది. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా  కర్ణాటక అభివృద్ధిని గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి వరకు తాము చేసిన పనులను వివరిస్తూ, తదుపరి ప్రభుత్వం ఏర్పాటైతే ఏం చేస్తామనేది వివరిస్తూ మోదీ  ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు ఏప్రిల్ 29న బెంగళూరులోని మాగడి రోడ్, నైస్ రోడ్ జంక్షన్ సుమనహళ్లితో సహా నగరంలోని వివిధ ప్రాంతాల గుండా 5.3 కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో నిర్వహించారు. ఇవాళ, రేపు మెగా రోడ్ షో నిర్వహించనుండగా.. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరపనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. జేడీఎస్ కూడా కింగ్ మేకర్‌గా ఎదగాలని ఆశలు పడుతుంది.