లండన్లో అట్టహాసంగా కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం

లండన్లో అట్టహాసంగా కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం
బ్రిటన్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం శనివారం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్వాసులు వీక్షిస్తుండగా రాజ కిరీటాన్ని కింగ్ ఛార్లెస్ 3 ధరించారు. 7 దశాబ్దాల్లోనే అతిపెద్ద ఈవెంట్ను బ్రిటన్వాసులు ఆద్యంతం వీక్షించారు. 1000 ఏళ్ల నాటి ఈ ఆచారాన్ని  21వ శతాబ్దపు బ్రిటన్ను  ప్రతిబింబించే విధంగా ఈ వేడుకను తీర్చిదిద్దారు. తాజా వేడుకలతో లండన్ వీధులు కిక్కిరిసిపోయాయి. వెస్ట్‌మినిస్టర్ అబేలో సెయింట్ ఎడ్వర్ట్ కిరీటాన్ని ధరించిన 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తన పాలనలో చట్టాలను, ఇంగ్లండ్ చర్చిని గౌరవిస్తానని చెప్పారు. తాను సేవ చేయించుకోవడానికి కాదు..సేవ చేయడానికి వచ్చానంటూ చార్లెస్ వ్యాఖ్యానించారు. తన బాధ్యతలకు కట్టుబడి ఉంటానంటూ ఆయన బైబిల్ మీద ప్రమాణం చేశారు. అనంతరం ఆర్చ్ బిషప్ కాంటర్‌బరీ కింగ్‌ ను భగవంతుడు రక్షిస్తాడని (గాడ్ సేవ్ కింగ్) ప్రకటించారు.
 
లండన్ వెస్ట్మినిస్టర్ అబేలో ఈ వేడుకలు జరిగాయి. కింగ్ చార్లెస్ III, సుమారు 2200 మంది దేశవిదేశాలకు చెందిన అతిథుల సమక్షంలో పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కింగ్ చార్లెస్III, క్వీన్ కాన్సర్ట్ కామిలాతో కలిసి బకింగ్ హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబే కు బంగారు రథంలో బయలుదేరారు. 
భారత దేశం తరపున ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి ఈ వేడుకలకు హాజరయ్యారు. రాజ కుటుంబ నుంచి విడిపోయిన ప్రిన్స్ హ్యారీ సైతం ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. కాగా, ఆయన భార్య, పిల్లలు వేడుకలకు దూరంగా ఉండిపోయారు. బంగారు రథం ప్రయాణించే మార్గంలో వేలమంది కాబోయే రాజును చూసేందుకు బారులు తీరారు.
కింగ్ చార్లెస్, కామిల్లా ప్రజలకు అభివాదం చేస్తూ వెస్ట్‌మినిస్టర్ అబే కు వెళ్లడం అందర్నీ ఆకర్షించింది. కాగా అబే ప్రాంతానికి సామాన్యులకు అనుమతి లేదని ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్లో క్వీన్ ఎలిజిబెత్ 2 మరణంతో బ్రిటన్ తదుపరి రాజుగా చరిత్రలో నిలిచారు 74 ఏళ్ల ఛార్లెస్. తాజాగా ఆయనకి పట్టాభిషేకం చేయడంతో ఛార్లెస్ రెండో భార్య, 75 ఏళ్ల కమీలియా  ‘రాణిగా’ మారారు.
ఈ వేడుకలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ బైబిల్ని చదివారు. హిందువు అయిన సునక్  బైబిల్ను చదవడం భిన్నమత విశ్వాసాలను రాజకుటుంబం ప్రోత్సహిస్తుందనడానికి నిదర్శనం అని అధికారులు చెప్పారు. ‘ఇది మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయానికి గర్వకారణం,’ అని ఛార్లెస్ పట్టాభిషేకాన్ని రిషి సునక్ అభివర్ణించారు.

తాజా పట్టాభిషేకంతో బ్రిటన్తో పాటు 14 కామెన్వెల్త్ దేశాలకు రాజు అయ్యారు ఛార్లేస్ 3. మరోవైపు ఛార్లెస్ 3కి కిరీటం ధరిస్తుండగా బ్రిటన్వ్యాప్తంగా టపాసులు పేలాయి. గౌరవార్ధంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. మరోవైపు అనేకమంది రిపబ్లిక్ యాక్టివిస్ట్లు ఛార్లెస్ 3 పట్టాభిషేకానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ‘నాట్ మై కింగ్ (నా రాజు కాదు)..’ అంటూ నినాదాలు చేశారు. వీరిలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.