మనీష్ సిసోడియాపై 2500 పేజీల చార్జిషీటు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాదాపు 2500 పేజీల చార్జిషీటును దాఖలు చేసింది. ఎక్సైజ్ పాలసీలో సిసోడియాపై సీబీఐ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మార్చి 9న సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది.
 
అంతకు ముందు సుదీర్ఘ విచారణ తర్వాత ఫిబ్రవరి 26న సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. ఈ కేసులో మనీష్ సిసోడియా 29వ నిందితుడిగా ఉన్నారు. ఇటీవల మూడో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ ఇందులో సంచలన విషయాలు చెప్పింది ఈడీ.
 
లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే ముడుపులు ఇచ్చారని ఆరోపించింది ఈడీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత తమ బినామీల ద్వారా వ్యాపారం చేశారని తెలిపింది. లిక్కర్ లాభాలతో  అరుణ్ పిళ్లై ద్వారా కవిత భూములు కొనుగోలు చేశారని చెప్పింది. తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది.
 
మరోవైపు ఈడీ అరెస్ట్ కేసులో బెయిల్ కోసం సిసోడియా ఢిల్లీ హైకోర్టులో  బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణకు మే 11వ తేదీకి వాయిదా వేసింది.  సిసోడియా మధ్యంతర బెయిల్ దరఖాస్తుతో పాటు, తన భార్య అనారోగ్యం కారణంగా సాధారణ బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేశారు.
 
ఆయన భార్య గత 20 ఏళ్లుగా నాడీ వ్యవస్థకు సంబంధించిన మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడుతున్నారని సిసోడియా తరఫు సీనియర్ న్యాయవాదులు దయన్ కృష్ణన్, మోహిత్ మాథుర్ హైకోర్టులో వాదించారు. ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియా ప్రధాన కుట్రదారు అని ఈడీ తరపు న్యాయవాది పిటిషన్‌ను వ్యతిరేకించారు. మనీలాండరింగ్ కేసులో తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఏప్రిల్ 28న ఇచ్చిన ఉత్తర్వులను సిసోడియా సవాలు చేశారు.