జమ్మూకశ్మీరులో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో గురువారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  అప్రమత్తమైన ఆర్మీ దళాలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి.

బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందడంతో గురువారం తెల్లవారుజామున భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో సైన్యం కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

వారిద్దరు లష్కరే తొయీబాకు చెందిన వారని, షోపియాన్‌ జిల్లాకు చెందిన షకీర్‌ మాజిద్‌ నాజర్‌, హానన్‌ అహ్మద్‌గా గుర్తించామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నెలలోనే ఉగ్రవాద సంస్థలో చేరినట్లు వెల్లడించారు. దీంతో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

సంఘటన స్థలంలో ఏకే 47 రైఫిల్, ఒక పిస్టల్‌, ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు గురువారం తెల్లవారుజామున అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి చెప్పారు.

భద్రతా బలగాల సెర్చ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. కుప్వారాలో చొరబాటు యత్నం విఫలమైంది. ఎల్‌ఓసి మీదుగా మచిల్ సెక్టార్ వైపు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్‌లలో ఒకదాని నుంచి ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడే అవకాశం ఉందని సమాచారం అందింది. దీంతో కేంద్ర భద్రతా దళాలను హై అలర్ట్ చేశామని శ్రీనగర్‌కు చెందిన డిఫెన్స్ ప్రతినిధి కల్నల్ ఎమ్రాన్ ముసావి చెప్పారు.