మోదీపై వ్యాఖ్యలకు ఖర్గే కుమారుడికి ఈసీ నోటీసు

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చేసిన వ్యాఖ్యలకు గాను ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే చిక్కుల్లో పడ్డారు. దీనిపై భారత ఎన్నికల కమిషన్  ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో కలబురగి జిల్లా చిట్టపూర్ నియోజకవర్గం నుంచి తిరిగి గెలిచేందుకు పోటీలో ఉన్న ప్రియాంక్ ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
ఇటీవల ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ, బంజారాలు బాధపడవద్దని, ఢిల్లీ పీఠంపై మీ కొడుకు ఉన్నాడని అన్నారని, నిజానికి మోదీ బంజారా కొడుకు కాదని, పనికిమాలిన కొడుకు (నలాయక్ బేటా) అని చెప్పారు. అలాంటి పనికిమాలిన కొడుకు ఏం చేస్తారని, మన ఇల్లు ఎలా గడుస్తుందని ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు.  ప్రధాని ఇంతకుముందు వచ్చినప్పుడు కోలి సామాజిక వర్గం కొడుకునని చెప్పారని, కల్బలిగ, కరుబ కమ్యూనిటీకి చెందిన వాడినని అన్నారని, ఇవాళ జంజారాల కొడుకునని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది.
 
మే 10న జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం కావడంతో ఓర్వలేకనే కాంగ్రెస్ మోదీపై అనుచిత వ్యాఖ్యలకు దిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు. ప్రియాంక ఖర్గే తండ్రి మల్లికార్జున ఖర్గే మొన్ననే మోదీని ‘విషనాగు’ అంటూ వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు ప్రియాంక్ ఖర్గే మోదీని పనికిమాలిన కొడుకు అని అన్నారని తప్పుపట్టారు.
 
ఈ విషయంపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనితోపాటు గోయల్ సారథ్యంలోని బీజేపీ ప్రతినిధుల బృందం మంగళవారనాడు ఈసీని కలిసి, ప్రియాంక్ ఖర్గేపై ఫిర్యాదు చేసింది. మరోవంక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విషకన్య  అంటూ సంబోధించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్‌కు కూడా ఈసీ నోటీసులిచ్చింది.