
ఆదివారం నుండి వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో తిరుమలను సందర్శించే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధం కావాలని ఆయా విభాగాధిపతులను టిటిడి కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో శనివారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మే 1 నుంచి జులై 15వ తేదీ వరకు యాత్రికుల అవసరాలను తీర్చడానికి సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని చెప్పారు. తిరుమలకు జూలై 15వ తేదీ వరకు డిప్యూటేషన్పై వచ్చే సంబంధిత అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారివారికి విధులు కేటాయించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ, సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే క్యూ లైన్లు, వైకుంఠం కాంప్లెక్స్లు, కంపార్ట్మెంట్లలో తాగు నీరు, అన్నప్రసాదం తదితర సేవలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత విభాగాధిపతులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీకి తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పిఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.
అవసరమైన ప్రాంతాలలో ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, తిరుమలలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని కీలక ప్రదేశాల్లో భక్తులకు సేవలు అందించేందుకు తగిన సంఖ్యలో శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని పిఆర్ఓ డాక్టర్ టి.రవిని ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదం, నీరు, లడ్డూ ప్రసాదాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది పరిశీలించేందుకు శ్రీవారి సేవా పర్యవేక్షకులను కేటాయించాలని పేర్కొన్నారు.
సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు సంబంధిత శాఖకు ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఈఓ ఆదేశించారు.
అనంతరం దర్శనానికి వచ్చే భక్తులకు వెండి వాకిలి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడంపై వివరంగా చర్చించారు. వేసవి కాలంలో తిరుమలకు విచ్చేసే భక్తులకు ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ను రూపొందించాలని తిరుమల పోలీసులను ఈఓ కోరారు.
More Stories
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు