ఐరాసలో కాశ్మీర్ అంశం ప్రస్తావించిన పాక్ పై భారత్ మండిపాటు

ఐరాసలో మరోసారి పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారతదేశం తీవ్రస్థాయిలో ఆక్షేపణ తెలిపింది. పాకిస్థాన్ ఎన్ని ప్రగాల్బాలాలకు దిగినా, ఏకంగా ఎంత మొత్తుకున్నా అసత్యం సత్యం కాబోదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధుల యంత్రాంగం తరఫున కౌన్సిలర్ ప్రతీక్ మథూర్ చెప్పారు.  జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌లు భారతదేశ అంతర్భాగాలు, వీటిని విడదీసి చూపే యత్నాలకు దిగడం కుటిలత్వమే అవుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి వాటిపై ఇప్పటికైనా పాకిస్థాన్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఇటీవల పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ జమ్మూ కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించారు. ఐరాసకు చెందిన వివిధ వేదికల నుంచి ఈ విధంగా పాకిస్థాన్ ప్రతినిధులు అసందర్భ వ్యాఖ్యలకు దిగుతున్నారని దీనిని సహించేది లేదని ప్రతీక్ హెచ్చరించారు. తప్పుడు సమాచారాలతో సత్యాన్ని కప్పిపుచ్చడం తగదన్నారు. ఏ దేశం అయినా ఏ అంశంపై అయినా దుష్ప్రచారానికి దిగడం, దీనినే తమ విదేశీ పాలసీగా భావించుకోవడం చేజేతులా పరువు తీసుకోవడం అవుతుందని విమర్శించారు.

లేనిది ఉన్నట్లుగా చిత్రీకరిస్తే అది గొప్పతనం అవుతుందా? వాస్తవికత మరుగున పడుతుందా? అని ప్రశ్నించిన భారతీయ ప్రతినిధి జమ్మూ కశ్మీర్ లేదా లద్థాఖ్‌లు ఎప్పటికీ భారత్ అనుసంధాన భాగాలే అవుతాయని, ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని తెలిపారు. ఐరాస జనరల్ అసెంబ్లీ ఓ ప్రతిష్టాత్మక వేదిక. ఇక్కడి నుంచి ఏ దేశం అయినా పనిగట్టుకుని దుష్ప్రచారానికి దిగడం ద్వారా కీలక వేదికలను దిగజార్చడమే అవుతుంది. వాటి ప్రతిష్టను దెబ్బతీసినట్లు అవుతుందని ప్రతీక్ చెప్పారు.

ఐరాస ప్రతినిధులు తమ అజ్ఞానాన్ని భౌగోళిక వలసవాద ముగింపు ప్రక్రియల తరువాతి పరిణామాల చరిత్ర తెలియని అమాయకత్వాన్ని అదేపనిగా వల్లించుకోరాదని ఈ సందర్భంగా అంతకు ముందు ఐరాసలో భారత రాయబారి రుచిర కాంబోజ్ కూడా స్పష్టం చేశారు. పాకిస్థాన్ పదేపదే చెప్పిందే చెప్పి, ఐరాస సభ విలువైన కాలాన్ని దెబ్బతీస్తోందని తెలిపారు.

రాజకీయ ప్రయోజనాల దిశలోనే వీటో వినియోగం

అత్యంత కీలకమైన ప్రాపంచిక విషయాలపై కొన్ని దేశాలు వాడుకుంటున్న వీటో హక్కుతో మానవాళికి సకాలంలో అందాల్సిన మేలు జరగడం లేదని ఐరాసలో భారత్ ప్రతినిధి ప్రతీక్ మథూర్ తెలిపారు. ఇప్పుడు వీటో వినియోగం కేవలం రాజకీయ ప్రయోజనాల దిశలోనే సాగుతోందని, నైతిక బాధ్యతతో కాదని విమర్శించారు.

వీటో హక్కు వాడకంపై ఐరాస సాధారణ సభలో జరిగిన ప్లీనరీలో భారతదేశం తరఫున మాట్లాడుతూ గత 75 ఏండ్లుగా ఇదే తంతు సాగుతోందని, ఈ తరహా వీటో ప్రయోగానికి అడ్డుకట్ట పడకుంటే ఇదే తంతు నిర్విరామంగా సాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాస ఉద్ధేశం అయిన సర్వసత్తాకతల సమానతకు విరుద్ధంగా ఐదు దేశాలకే వీటో హక్కు ఉండటం వల్ల పలు అనర్థాలకు దారితీస్తోందని హెచ్చరించారు. ఏకంగా ఐరాస అసలు లక్షాలే దెబ్బతింటున్నాయని, కొన్ని దేశాల ఆధిపత్యానికి ఈ వీటో అధికారం ఆయుధం అవుతోందని భారత ప్రతినిధి విమర్శించారు.