కాంగ్రెస్ పార్టీకే వారంటీ గడువు ముగిసింది

“ఉచిత హామీల సంస్కృతి” పై విరుచుకుపడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఎన్నో కల్పిస్తామని హామీలు ఇచ్చిందని, ఆ పార్టీకే వారంటీ గడువు ముగిసినప్పుడు ఇక గ్యారంటీలకు అర్థం ఏముందని ప్రధాని నరేంద్ర మోదీ అపహాస్యం చేశారు. ఈ రేవిడి కల్చర్ (ఉచిత హామీల సంస్కృతి) ముగిసి పోవాలని ఆయన స్పష్టం చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గురువారం లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉదేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ బూత్ స్థాయి నుంచి ప్రచారం పటిష్టంగా సాగాలని ప్రబోధించారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను ఉదహరించారు. వారి ఎన్నికల హామీలు ఇప్పటికీ గ్యారంటీగానే మిగిలి పోయాయని గుర్తు చేశారు.

కాంగ్రెస్ అంటే “అవినీతి, బంధుప్రీతి గ్యారంటీ” గా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కర్ణాటకలో అన్ని ఇళ్లకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, కుటుంబం లోని యజమానురాలికి గృహలక్ష్మి పథకం కింద నెలనెలా రూ. 2000 ఆర్థిక సాయం, డిగ్రీ చదివిని యువతకు ప్రతినెలా రూ.3000, డిప్లొమా విద్యార్థులైన 1825 ఏళ్ల వయసు యువతకు రెండేళ్ల పాటు నెలకు రూ. 1500 ఇస్తామని ఉచితహామీలు గుప్పించింది.

ఉచిత హామీల కారణంగా రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయని, దేశం కానీ, ప్రభుత్వాలు కానీ ఈ విధంగా పాలన సాగించలేవని ప్రధాని హెచ్చరించారు. అధికారం కోసం, అవినీతి కోసం కొన్ని రాజకీయ పార్టీలు సామ, దాన, దండ, బేధ మార్గాలు ఉపయోగిస్తన్నాయని ప్రధాని  విమర్శించారు.

ఈ పార్టీలు దేశ భవిష్యత్తు, కర్ణాటక భావి తరాల యువత, మహిళల గురించి ఆలోచించడం లేదని మోదీ ఆరోపించారు. ప్రభుత్వాలు తాత్కాలిక అవసరాల కోసం పాలన సాగించకూడదని, సంపద సృష్టికి పాటుపడాలని ఆయన సూచించారు. అందువల్ల కుటుంబాలు కొన్ని దశాబ్దాల పాటు గాడిన పడతాయని పేర్కొన్నారు.

వచ్చే 25 ఏళ్ళల్లో కర్ణాటక అభివృధ్ధికోసం కృషి చేసేందుకు బిజెపి `యువ బృందం’ను ఏర్పర్చుతున్నట్లు చెబుతూ పార్టీ ఎప్పుడూ తమ పార్టీ ఎప్పుడూ ఎన్నికలలో విజయం గురించి మాత్రమే మాత్రమే ఆలోచింపదని, మొత్తం దేశం గురించి ఆలోచిస్తుందని ప్రధాని తెలిపారు. బీజేపీ దగ్గరి మార్గాలు అవలంబించడం లేదని, అభివృద్ధి భారతం కోసం పనిచేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. తాత్కాలిక సవాళ్లను ఉద్దేశించి పేదలకు వీలైనంత సాయం చేయడమౌతోందని ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సినేషన్, తదితర సౌకర్యాలు కల్పించడమైందని ఆయన ఉదహరించారు.

తాను త్వరలో కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తానని చెబుతూ  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజారిటీ సాధిస్తుందని ప్రధాని రమోదీ జోస్యం చెప్పారు. ‘‘ కర్ణాటక రాష్ట్ర ప్రజల మన్ననలు పొందేందుకు ఒకటి రెండు రోజుల్లో నేను కర్ణాటకలో పర్యటిస్తాను. రాష్ట్రంలో ప్రచారం చేసిన బీజేపీ నేతలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కర్ణాటక ప్రజలకు బీజేపీపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.