బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేతకు జీవిత ఖైదు

 టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న వినోద్ కుమార్ జైన్ ను 2022 లో జరిగిన బాలిక ఆత్మహత్య కేసులో దోషిగా నిర్దారించిన విజయవాడలోని పోక్సో కోర్టు రూ. 3 లక్షల  జరిమానాతో పాటు సెక్షన్ 305 కింద జీవితకాలం జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.  పోక్సో చట్టంలోని 9,10 సెక్షన్ల కింద ఏడేళ్లు కఠినకారాగార శిక్ష విధించింది.

కోర్టు విధించిన 3 లక్షల జరిమానాను బాధితుల కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది.  ఈ కేసులో బాధితుల తరపున గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో తొమ్మిదో తరగతి  బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశాడు. అత్యంత దారుణంగా లైంగికంగా వేధించాడని అప్పట్లో బాలిక సూసైడ్ నోట్లో తాను అనుభవించిన అకృత్యాలను రెండు పేజీల్లో  పేర్కొంది.

బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారని  పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి  పేర్కొన్నారు. దోషిగా పేర్కొన్న వినోద్ జైన్ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్ గా పోటీచేసి ఓడిపోయారు.   సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో పోలీసులు  ఈ కేసును సీరియస్గా తీసుకొని శాస్త్రీయ ఆధారాలు సేకరించడంతో నిందితుడికి శిక్ష పడిందని నాగిరెడ్డి తెలిపారు.

విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలిక ఓ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతుంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినోద్ జైన్ పై కేసు నమోదు చేశారు.

నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్ల ప్రకారం కేసులను నమోదు చేశారు. వినోద్ జైన్ లైంగిక వేధింపుల కారణంగానే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. విచారణ కోసం వినోద్ జైన్ ఇంటిని సీజ్ చేశారు.

రెండు నెలల పాటు వినోద్జైన్ బాలికను లైంగికంగా వేధించాడని పోలీసులు గుర్తించారు. దీంతో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక క్షోభతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. అపార్ట్ మెంట్ లిఫ్ట్లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వినోద్ జైన్ వేధించేవాడని సూసైడ్ నోట్లో రాసింది