వరికెపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి వైల్డ్ లైఫ్ అనుమతులు

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం అయిన  వైల్డ్ లైఫ్ (వన్య ప్రాణుల) అనుమతులకు క్లియరెన్స్‌లను కేంద్రం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి  క్లియరెన్స్‌లు పొందటానికి రాష్ట్రం ప్రభుత్వం నుండి పంపిన నివేదికలను కేంద్రం పరిశీలించి నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ క్లియరెన్స్‌ నుండి అనుమతులను మంగళవారం జారీ చేసింది.

ఈప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్య భాగాలైన పంప్‌ హౌస్, ప్రెజర్‌మెయిన్, బ్రేక్‌ ప్రెజర్‌ ట్యాంక్‌, ఇతర నిర్మాణాలు చేపట్టడానికి భూమి అటవీ ప్రాంతంలో ఉంది. ఇది రాజీవ్‌ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం, నాగార్జున శ్రీశైలం పులుల అభయారణ్యంలో ప్రధాన ప్రాంతం.  మొత్తం 19.13 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం కోసం తీసుకోవాల్సి ఉంది. దీనికి పరిహారంగా రెవెన్యూ భూమిని ఇవ్వాల్సి ఉంది.

 
నిర్మాణానికి అటవీ భూమి తరలింపునకు వన్య ప్రాణుల అనుమతులు కావాల్సి ఉండగా కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో కృషి చేశారు. అటవీ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు విన్నవించారు. పల్నాడు ప్రాంతంలో ప్రాజెక్టు ప్రాదాన్యతను వివరించి అనుమతులు రావటానికి కీలక పాత్ర పోషించారు.

అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళేందుకు అటవీ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు  కృషి అనిర్వచనీయం. ఈ ప్రాజెక్టు ద్వారా మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని, వెల్దుర్తి, దుర్గి, బోల్లాపల్లి మండలాల్లో, మొత్తం 50–70వేల ఎకరాలకు సాగునీరు, 4.5లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెల్దుర్తి మండలంలోని, గంగలకుంట సమీపంలో నల్లమడ అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సి ఉంది.