సూడాన్ నుంచి భారతీయుల తరలింపుకు ‘ఆపరేషన్ కావేరీ’!

ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. . ప్రస్తుతం అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఆ దేశంలో ఇప్పటికే సుమారు 500 మంది వరకు సాధారణ పౌరులు మరణించగా, 3,500 మంది గాయపడ్డారు. మృతుల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. సంక్షోభంలో ఉన్న సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నారు.
 
ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు ‘ఆపరేషన్ కావేరి’  మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్ ఇప్పటికే చేపట్టామని, 500 మంది భారతీయులు సోమవారం సూడాన్ పోర్ట్‌కు చేరుకున్నారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ‘వారిని తీసుకురావడానికి మన నౌకలు, విమానాలు సిద్ధంగా ఉన్నాయి. సూడాన్‌లోని మన సోదరులను రక్షించుకునేందుకు, సాయపడేందుకు కమిట్ అయ్యాము’ అని ట్వీట్‌లో తెలిపారు.

సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు రెండు సి130 విమానాలు, నావికా నౌక ఐఎన్‌ఎస్ సుమేధను సిద్ధంగా ఉంచారు. అధికార డేటా ప్రకారం సూడాన్‌లో 4000 మంది భారతీయులు ఉన్నారు. జై శంకర్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కూడా మాట్లాడారు. ఆ రెండు దేశాలు కూడా సాయపడతామని హామీ ఇచ్చాయి.

సూడాన్‌లో అధికారం కోసం హింసాత్మక ఘర్షణ జరుగుతోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న అంతర్జాతీయ ప్లాన్‌ను కూడా అక్కడి వారు తిరస్కరించి పోరాడుతున్నారు. రెండు పక్షాల వారు ఒకరినొకరు నిందించుకుంటూ ఘర్షణ పడుతున్నారు.

కాగా, వార్‌ జోన్‌ దేశాలైన ఆఫ్ఘనిస్థాన్‌, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతోపాటు విదేశీయుల తరలింపునకు ‘ఆపరేషన్‌ కావేరీ’ మిషన్‌ను భారత్‌ గతంలో చేపట్టింది. తాజాగా సుడాన్‌ నుంచి భారతీయులు, ఇతర దేశీయుల తరలింపునకు మిత్ర దేశాలతో కలిసి ఈ మిషన్‌ను కొనసాగిస్తున్నది. సోమవారం ఫ్రాన్స్‌ కూడా సుడాన్‌ నుంచి 388 మందిని తరలించింది. ఐదుగురు భారతీయులతో పాటు 28 దేశాలకు చెందిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.