సూడాన్‌ నుంచి భారతీయులను తరలించేందుకు కసరత్తు

ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో సంక్షోభం ముదురుతున్నది. ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం రెండో వారానికి చేరింది. ఇప్పటికే సుమారు 500 మంది పౌరులు మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. పోరాటం ఇంకా కొనసాగడంతో రాజధాని ఖార్తోమ్‌లోని రాయబార కార్యాలయం నుంచి దౌత్య ప్రతినిధులు, సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది. అమెరికా సైన్యం సహకారంతో దౌత్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా సుడాన్‌ నుంచి బయటకు తరలించింది.

ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన యుద్ధ విమానాలు, నేవీకి చెందిన యుద్ధ నౌకను సిద్ధంగా ఉంచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సుడాన్‌లో యుద్ధ తీవ్రత, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది.

సుమారు 70 మంది అమెరికన్ సిబ్బందిని ఎంబసీ నుంచి ఇథియోపియాలోని గుర్తు తెలియని ప్రదేశానికి విమానంలో తరలించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన ఆదేశాల మేరకు ఖార్తోమ్‌ నుంచి అమెరికా దౌత్య సిబ్బందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు యూఎస్‌ మిలిటరీ ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుడాన్‌ రాజధాని ఖార్తోమ్‌లోని అమెరికా ఎంబసీని తాత్కాలికంగా మూసివేసినట్లు ఆయన వెల్లడించారు.

కాగా, సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సుడాన్‌ అధికారులతోపాటు ఐక్యరాజ్యసమితి, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్‌ ప్రభుత్వ వర్గాలతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు పేర్కొంది.

 ‘సన్నాహాల్లో భాగంగా, వేగంగా స్పందించేందుకు భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-130జే విమానాలు ప్రస్తుతం జెడ్డాలో సిద్ధంగా ఉన్నాయి. నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ కూడా సుడాన్‌ పోర్ట్‌కు చేరుకుంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తున్నది. యుద్ధం బీకరంగా మారుతుండడంతో విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. ఖార్తోమ్ లోని విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ పరిస్థితుల్లో రోడ్డు మార్గాల ద్వారా తరలించడమే సురక్షితమని ప్రభుత్వం యోచిస్తోంది.

2021 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటు వల్ల సుడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం సుడాన్‌ ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్ బుర్హాన్, ఆయన డిప్యూటీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)కు నేతృత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య విభేదాలు పెరిగాయి.

ఈ నేపథ్యంలో ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర పోరాటం జరుగుతున్నది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో సుడాన్‌లో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆర్మీ, పారామిలిటరీ మధ్య జరుగుతున్న ఫైటింగ్‌లో వందలాది సాధారణ పౌరులు మరణించారు. చాలా మంది మృతదేహాలు రోడ్డుపైనే పడి ఉన్నాయి.