ప్రపంచ సంప‌న్న‌ న‌గ‌రాల్లో భాగ్యనగరం

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాలు 2023 పేరిట హైన్లీ అండ్ పార్ట్‌నర్స్ ఓ నివేదిక విడుదల చేసింది. ఆఫ్రికా, సీఐఎస్, తూర్పు ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా అంటూ ప్రాంతాలుగా విభజించి హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ ఈ ధనిక నగరాల జాబితాను సిద్ధం చేసింది.

ఈ జాబితాలో అత్యధికంగా అమెరికా నగరాలు చోటు దక్కించుకున్నాయి. 2000లో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న లండన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం. భారత్‌లోని 5 పట్టణాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది.

ధనిక నగరాల జాబితాలో మన హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ మహా నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అత్యధిక నికర సంపద గల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగినట్లు తెలిపింది.

దేశంలో మొత్తం 59 వేల 400 మంది మిలియనీర్లతో ముంబాయి 21వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీ మహానగరం 30 వేల 200 మంది మిలియనీర్లతో 36వ స్థానంలో నిలిచింది. బెంగళూరు మహా నగరం 12,600 మంది మిలియనీర్లతో 60వ స్థానంలో నిలిచింది. 12, 100 మంది మిలియనీర్లతో కోల్‌కతా 63వ స్థానంలో ఉంది. 11 వేల 100 మంది మిలియనీర్లతో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ తొలి స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి ఈ మహా నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ వెల్లడించింది. మొత్తం 97 పట్టణాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జపాన్‌ రాజధాని టోక్యో 2,90,300 మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది.

2,85,000 మందితో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా మూడో స్థానంలో ఉంది. లండన్‌ (2,58,000), సింగపూర్‌ (2,40,100), లాస్‌ ఏంజెల్స్‌ (2,05,400), హాంకాంగ్‌ (1,29,500), బీజింగ్‌ (1,28,000), షాంఘై (1,27,200), సిడ్నీ (1,26,900) తొలి పది నగరాల జాబితాలో ఉన్నాయి.