సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే జగన్ కాపురం

సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే తాను కాపురం ఉంటానని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో జులై నాటికి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుందని ప్రకటించిన సిఎం మూలపేట పోర్టు శంకుస్థాపన నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సెప్టెంబర్ నాటికి విశాఖపట్నంలో కాపురం ఉంటానని ప్రకటించారు.
 
రాష్ట్రంలో అందరికి అమోదయోగ్యమైన విశాఖను వికేంద్రీకరణలో భాగంగా పరిపాలన రాజధాని చేయడాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని సిఎం చెప్పారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే ఉద్దేశంతోనే, అన్ని జిల్లాల అభివృద్ధి చెందాలని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపన, తాపత్రయం అని తెలిపారు.
 
సంత బోమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేస్తూ పోర్టు నర్మాణంతో ఉత్తరాంధ్ర రూపు , రేఖలు మారిపోతాయని స్పష్టం చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ. 365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుండి హిర మండలం రిజర్వాయర్‌కు రూ. 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ. 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా శంకుస్ధాపన చేశారు.
మరోవైపు శ్రీకాకుళం బహిరంగ సభలో సిఎం వైసీపీ ఎన్నికల ప్రచారభేరి షురూ చేశారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనుని ప్రకటించారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనుకు అంతా మద్దతివ్వాలని కోరారు.  ఉత్తరాంధ్ర సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుకోడానికి ఒక్క మంచి పని కూడా చేయని వారంతా తనకు వ్యతిరేకంగా ఏకం అవుతున్నారని ధ్వజమెత్తారు. ఒకే అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే చీకటి యుద్ధం రాష్ట్రంలో జరుగుతోందని దుయ్యబట్టారు.

ఆంధ్రాలో వ్యవస్థల్ని మేనేజ్‌ చేసేవారికి, ప్రజల్ని నమ్ముకున్న వారికి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. తనకు పత్రికలు, టీవీలు లేవని, టీడీపీ మాదిరి దత్తపుత్రుడు కూడా లేరని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న యుద్ధంలో తన ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం ప్రజలేనని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

తనను ఓడించడానికి తోడేళ్లంతా ఏకమవుతున్నా తనకు భయం లేదని స్పష్టం చేశారు. ప్రజలు అబద్దాలను నమొద్దని, అబద్దాలు చెప్పే అలవాటు తనకు లేదని, ప్రతి ఒక్కరి ఇంట్లో మంచి జరిగిందో లేదో కొలమానంగా తీసుకోవాలని, ప్రజలే సైనికుల మాదిరి యుద్ధానికి కదిలి రావాలన్నారు.