దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఎండ తీవ్రతతోపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఉత్తరప్రదేశ్లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది. ఇక సిక్కిం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.
ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలోనూ వేడి గాలులు వరుసగా రెండో రోజు కొనసాగాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తో పాటు దాని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు బీహార్ లో ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పాట్నా ఎయిర్ పోర్టులో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణగ్రతలు నమోదయ్యాయి. పాట్నాలో వేడిగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పనిచేయడం కష్టంగా మారింది.
కేరళ రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం కొట్టాయంలో రికార్డు స్థాయిలో 38 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. అయితే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం గ్లోబల్ వార్మింగే కారణమని ట్రాపికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకలాజికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ పున్నమ్ కురియన్ తెలిపారు. దీనికి చెట్లు నాటడమే పరిష్కారమని తెలిపారు.
బీహార్తోపాటు జమ్ము కశ్మీర్, పంజాబ్,హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండలు మండిపోతుంటే మే నెలలో మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎండల పట్ల ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. అటు ఎండలతో తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..శీతల పానియాలను ఆశ్రయిస్తు్న్నారు. కొబ్బరిబొండాలు, చెరుకురసాలు, నిమ్మరసాలను ఎక్కువగా తాగుతున్నారు. దీంతో ప్రస్తుతం వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్తున్నారు. బయటకు వెళ్తే టోపి లేదా రూమాలు కట్టువాలంటున్నారు. దాహం వేయకపోయినా తరుచుగా నీటిని తాగాలని, ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగుతుండాలని తెలిపారు.
వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రాకపోతే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు లేదా నిమ్మరసం, కొబ్బరి నీరు తాగాలి. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తలతిరగడం, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరల్లోని వైద్యున్ని సంప్రదించాలి. ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు.
మధ్యాహ్నం తరువాత అంటే 12గంటల నుంచి సాయంత్రం 3గంటల మధ్య కాలంలో బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయకూడదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగొద్దు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్దాలకు దూరంగా ఉండండి.
More Stories
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై అందరి దృష్టి
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్
రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్