కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌లకు అహ్మదాబాద్‌ కోర్టు సమన్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌లకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో నోటీసులు జారీ అయ్యాయి. ప్రధాని మోదీ డిగ్రీ విషయంలో కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ అవమానకర ప్రకటనలు చేశారంటూ గుజరాత్‌ యూనివర్సిటీ ఆరోపించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్‌ 500 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ విలేకరుల సమావేశంలో, ట్విట్టర్ హ్యాండిల్‌లో యూనివర్సిటీపై అవమానకర వ్యాఖ్యలు చేశారని యూనివర్సిటీ పేర్కొంది. దాంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ జయేష్‌భాయ్‌ చౌవాటియా కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌లకు సమన్లు జారీ చేశారు. మే 23న విచారణకు హాజరుకావాలని సూచించారు.

గుజరాత్‌ విశ్వవిద్యాలయం 70 సంవత్సరాల కిందట స్థాపించారని, ప్రజల్లో మంచి పేరుందని, ఇలాంటి ఆరోపణలతో యూనివర్సిటీపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటోందని గుజరాత్‌ యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు.  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయంతో తెలిసిందే.

ఈ విషయంలో ఆయనకు గుజరాత్‌ హైకోర్టు సైతం జరిమానా విధించింది. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పు అనుమానాలను మరింత పెంచిందని పేర్కొన్నారు. మోదీ చదువుకున్నట్లయితే నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకోరని ఎద్దేవా చేశారు. మోదీకి సరైన డిగ్రీ ఉంటే గుజరాత్‌ యూనివర్సిటీ ఎందుకు చూపించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మోదీ డిగ్రీ నకిలీదైనా అయి ఉండాలని, లేదంటే మోదీకి భయపడి గుజరాత్ యూనివర్సిటీ సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.

గుజరాత్ యూనివర్సిటీలో ప్రధాని చదివి ఉంటే మన విద్యార్థి దేశానికి ప్రధాని అయ్యాడని గుజరాత్ యూనివర్సిటీ సంబరాలు చేసుకోవాలని చెప్పారు. ప్రధాని ఫేక్ డిగ్రీని అసలైనదిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో యూనివర్సిటీ ఫేక్‌ డిగ్రీలను ఇస్తుందనే సందేశాన్ని పంపినట్లుగా నేతల వ్యాఖ్యలు ఉన్నాయని గుజరాత్‌ యూనివర్సిటీ తరఫు న్యాయవాది ఆరోపించారు.